బారులు తీరితే ప్రమాదం
వ్యాక్సిన్, పరీక్షల కోసం ఆసుపత్రుల వద్ద క్యూ
వ్యాక్సిన్, పరీక్షలు ఒకేచోట చేయడంతో ఇబ్బందులు
కూసుమంచి, ఏప్రిల్ 27 : కరోనా మహమ్మారి చుట్టేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు, వ్యాక్సిన్ కోసం ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించిన వారందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రులకు తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోతున్నది. గతంలో నేరుగా వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకోవాలంటే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. నెగిటివ్ వస్తేనే వ్యాక్సిన్ వేస్తున్నారు. ఉదయం సుమారు 10 గంటలకు వ్యాక్సిన్ వేయడం ప్రారంభిస్తున్నారు. అంతకంటే ముందే వందలాది మంది ఆసుపత్రి వద్ద బారులు తీరుతున్నారు. ఆసుపత్రి వద్ద కొవిడ్ పరీక్షల నమోదు, వ్యాక్సిన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తున్నారు. అన్ని పనులు ఒకే ప్రాంగణంలో జరుగుతుండడంతో పరీక్షల్లో కొవిడ్ వచ్చినవారితో అప్పటి వరకు పక్కనే ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా పరీక్ష రిపోర్టు వచ్చే వరకు ఎవరికీ కొవిడ్ ఉందనేది తెలియకపోవడంతో అంతా ఒకే చోట తిరుగుతున్నారు.
దూరం.. దూరం ఉండాలి..
ఆసుపత్రిలో కొవిడ్ పరీక్షలు, నమోదు చేయడం, వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, వ్యాక్సిన్ వేయించుకోవడం నాలుగు ఒకేచోట చేయడంతో అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. దీంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు బారులు తీరి నిలబడడం.. సామాజిక దూరం పాటించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. వైద్య సిబ్బందికి ఇది పెద్దసమస్యగా మారింది. ఎవరినీ కంట్రోల్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలకు, వ్యాక్సిన్కు వేర్వేరు సమయం కేటాయించాలి. వ్యాక్సిన్, పరీక్షలు వేర్వేరుగా చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా పరీక్షలు, వ్యాక్సిన్ కోసం వచ్చిన భౌతిక దూరం పాటించాలి. మాస్కులు ధరించి, శానిటైజ్ చేసుకుంటే బావుంటుందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
మొబైల్ వాహనంతో కరోనా పరీక్షలు
కరోనా సెకండ్ వేవ్ ఉధృతం కావడంతో మొబైల్ వాహనం ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పెనుబల్లిలో మంగళవారం గ్రామంలో పలు ప్రాంతాల వద్ద మొబైల్ వాహనం ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు వైద్యసిబ్బంది సమన్వయంతో పరీక్షలు చేశారు. భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశారు. లంకాసాగర్ పీహెచ్సీలో 48 మందికి పరీక్షలు చేయగా 17 మందికి, పెనుబల్లి సీహెచ్సీలో 95 మందికి పరీక్షలు చేయగా 18 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు.