న్యూఢిల్లీ: వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home).. చాన్నాళ్లు సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీలకే పరిమితమైన ఈ ఆప్షన్.. కరోనా కారణంగా చిన్నచిన్న కంపెనీలకూ పాకింది. పని జరిగితే చాలు ఎక్కడైతే ఏంటి అనుకునే కంపెనీలు సాధ్యమైనంత వరకూ తమ ఉద్యోగులకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. అయితే మెల్లమెల్లగా కేసులు తగ్గుముఖం పట్టడం, సెకండ్ వేవ్ వెళ్లిపోవడంతో చాలా సంస్థలు మళ్లీ తమ ఆఫీసులను తెరుస్తున్నాయి. ఉద్యోగులను రమ్మంటున్నాయి. కానీ ఇంట్లో పని చేయడం అలవాటైన ఉద్యోగులు మాత్రం ఇలాగే కొనసాగితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. తాజా సర్వే ఒకటి 46 శాతం మంది ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తేల్చింది. మరో 29 శాతం మంది హైబ్రిడ్ మోడల్కు ఓకే అంటున్నారు.
అదే సమయంలో కంపెనీలు మాత్రం రివర్స్గా ఆలోచిస్తున్నాయి. 42 శాతం సంస్థలు హైబ్రిడ్ మోడల్ వైపు మొగ్గు చూపగా.. 35 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ అంటున్నాయి. మహిళా ఉద్యోగుల విషయానికి వస్తే 51 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగాలని కోరుకుంటుండగా.. పురుషుల్లో ఇది 29 శాతంగా ఉంది. సీనియర్ మేనేజ్మెంట్లో 52 శాతం, మిడిల్ మేనేజ్మెంట్లో 36 శాతం, జూనియర్ లెవల్లో 31 శాతం ఇంటి నుంచి పని వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండియా హైరింగ్ ట్రాకర్ పేరుతో ఈ సర్వే జరిగింది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీల హైరింగ్ 11 శాతం పెరిగినట్లు తేల్చింది.