ముంబై: ఎల్గర్ పరిషత్ కేసులో నిందితుడైన స్టాన్ స్వామి మరణానికి నిరసనగా ఈ కేసులోని మిగతా పది మంది నిందితులు ముంబైలోని తలోజా జైలులో బుధవారం నిరాహార దీక్ష చేశారు. ఈ కేసులో సహ నిందతులైన రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధవాలే, మహేష్ రౌత్, అరుణ్ ఫెర్రెరా, వెర్నాన్ గోన్సాల్వ్స్, గౌతమ్ నవలఖా, ఆనంద్ టెల్తుంబే, రమేష్ గైచోర్, సాగర్ గోర్ఖే తలోజా జైలులో బుధవారం ఒక రోజు ఉపవాసం ఉన్నారు. స్టాన్ స్వామిని సంస్థాగతంగా హత్య చేశారని వారు ఆరోపించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్ఐఏ)తోపాటు తలోజా జైలు మాజీ అధికారి కౌస్తుబ్ కుర్లేకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుర్లేకర్, ఎన్ఐఏ అధికారులు 84 ఏండ్ల స్టాన్ స్వామిని చాలా హింసించడంతోపాటు పలు వేధింపులకు గురిచేశారని, ఆయనను సంస్థాగతంగా హత్య చేసేందుకే తమ నుంచి వేరు చేశారని వీరు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎల్గార్ పరిషత్, మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన స్టాన్ స్వామి గత ఏడాది నుంచి విచారణ ఖైదీగా ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం మరణించారు.