న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ మేరకు పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2022, సెప్టెంబర్లో కాంగ్రెస్ పార్టీకి పర్మినెంట్ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు కూడా వెల్లడించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. గతంలో ఒకటి రెండు సార్లు శాశ్వాత అధ్యక్షుడి ఎన్నిక కోసం ప్రయత్నాలు జరిగినా ఆ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మరికొంత కాలం సోనియానే పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఆమెనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశం జరుగడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూఢిల్లీలోని ఏఐసీసీ హెడ్క్వార్టర్స్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. కరోనా మహమ్మారి దేశంలో కాలుమోపిన తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం జరుగడం ఇదే తొలిసారి. పార్టీ సంస్థాగత ఎన్నికలు, వచ్చే ఏడాది జరుగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, లఖింపూర్ ఖేరీ ఘటన సమావేశం ఎజెండాలో టాప్ ప్లేస్లో ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇటీవలి పరిణామాలపై కూడా సమావేశం ఎజెండాలో ఉన్నట్లు సమాచారం.