మాదాపూర్, మే 8: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. శనివారం మియాపూర్లోని కల్వరీ టెంపుల్ ప్రాంగణంలో అంకురా, థెరిస్సా దవాఖానల సౌజన్యంతో 300 పడకలు, 50 ఆక్సిజన్ బెడ్లతో ఏర్పాటుచేసిన కొవిడ్ కేర్ సెంటర్ను ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రజలు కరోనా బారినపడకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులను ధరించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ల, బెడ్లకు కొరత లేకుండా ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ ముందస్తు కట్టడికి చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. కొవిడ్ బారినపడినవారి ప్రాణాలు కాపాడేందుకు కల్వరీ టెంపుల్ వ్యవస్థాపకుడు బ్రదర్ సతీష్కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కథలాపూర్: ఉపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ గుండెపోటుతో మృతిచెందిన వలసజీవి మృతదేహం శనివారం స్వగ్రామం చేరింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా భూషణరావుపేటకు చెందిన తిపిరి దేవయ్య (48) కొద్దిరోజుల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ హవాజ్ కంపెనీలో క్లినింగ్ విభాగంలో పనికి కుదిరాడు. గతనెల 30న విధులు ముగించుకొని తన గదికి చేరుకున్న ఆయన గుండెపోటుతో మృతిచెందాడు. అక్కడి నుంచి మృతదేహాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకురాగా, స్వగ్రామానికి తరలించేందుకు ఎమ్మెల్సీ కవిత అంబులెన్స్ ఏర్పాటుచేసినట్టు నాయకులు తెలిపారు.