సర్వేనంబర్ల ఆధారంగా భూముల వద్దే రికార్డుల తనిఖీ
మేడ్చల్, మే 10 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్ ఆలయ భూములను ఐఏఎస్ల ప్రత్యేక విచారణ కమిటీ సోమవారం పునఃపరిశీలించింది. దేవాదాయ, రెవెన్యూ రికార్డుల్లోని సర్వేనంబర్ల ఆధారంగా కమిటీ భూముల వద్దే స్వయంగా తనిఖీచేసింది. కబ్జాచేసి ఫెన్సింగ్ వేసిన భూముల వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించారు. దేవాదాయ భూములతోపాటు కబ్జాకు గురైన సీలింగ్ భూముల వివరాలను కూడా సేకరించారు. శ్రీసీతారామస్వామి ఆలయ భూముల వ్యవహారంలో మాజీమంత్రి ఈటల రాజేందర్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఐఏఎస్ల ప్రత్యేక కమిటీ విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధికార యంత్రాంగం 8 బృందాలుగా ఏర్పడి నిర్వహించిన సర్వే ఆధారంగా దేవాదాయ భూముల కబ్జాదారుల వివరాలను సేకరించినట్టు సమాచారం. దీంతో తిరిగి ఆ భూములను పున పరిశీలించిన కమిటీ అవి కబ్జాలకు గురైనట్టు నిర్ధారించుకున్నట్టు తెలిసింది. దేవుడిమాన్యంలో నిర్మాణాలు జరిపిన వారి పూర్తి వివరాలను మూడురోజుల కిత్రం పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, విద్యుత్తు విభాగాల అధికారుల విచారణలో ప్రత్యేక కమిటీ రాబట్టినట్టు సమాచారం. ఇప్పటికే 160 అక్రమ నిర్మాణాలను గుర్తించిన కమిటీ వీటిపై మున్సిపల్శాఖనూ విచారించే అవకాశం ఉన్నది.