న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో తమిళనాడులో ఎన్నికల ర్యాలీలకు అనుమతించిన ఎన్నికల సంఘం (ఈసీ)పై హత్య కేసు నమోదు చేసి ఉండాల్సిందన్న మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టును ఈసీ ఆశ్రయించింది. వాస్తవాలు తెలుసుకోకుండా చేసిన వ్యాఖ్యలని ఆరోపించింది. ‘మద్రాస్ హైకోర్టు నిర్లక్ష్యంగా, అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది. స్వతంత్ర రాజ్యాంగ అధికారం ఉన్న ఒక సంస్థ (ఈసీ)పై స్వతంత్ర రాజ్యాంగ అధికారం ఉన్నమరో సంస్థ (మద్రాసు హైకోర్టు) ఎటువంటి ఆధారాలు లేకుండా హత్య ఆరోపణలు చేసింది, ఇది చివరికి రెండు సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసింది..’ అని తన పిటిషన్లో ఈసీ పేర్కొంది.
కాగా, జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈసీ పిటిషన్పై సోమవారం విచారణ జరుపనున్నది. మరోవైపు సున్నితమైన కేసులలో కోర్టులు అనవసరమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని కోవిడ్ సంబంధిత సమస్యలపై శుక్రవారం విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.