ఒక పార్టీ లేదా ప్రభుత్వం ఏ వ్యక్తికైనా పదవులు హోదాలు కల్పిస్తే.. సదరు హోదాలను పార్టీ పటిష్ఠానికి లేదా ప్రజల అభివృద్ధికి వినియోగించాలి. లేదా పార్టీ ఆశయం సిద్ధించేందుకు ఉపయోగించాలి. ఇదే సమయంలో పదవుల అవకాశమిచ్చిన పార్టీకి, ప్రభుత్వంపై లేదా అవకాశం కల్పించిన నాయకులకు విధేయంగా ఉండటమనేది సహజత్వం కావాలి. ప్రతి పార్టీకి ఒక నియమావళి ఉంటుంది. ఎవరైనా వాటి పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. కానీ, ఇవేవి తనకు పట్టవన్నట్లుగా సొంత నిర్ణయాలు తీసుకోవడం.., తిన్నింటి వాసాలు లెక్కించడం మంచి పద్ధతి కాదు. ప్రస్తుతం మంత్రి ఈటల రాజేందర్ ఇదే కోవలో పయనిస్తున్నారు. పదిహేడేండ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఆయన.. తన సామ్రాజ్యం విస్తరించినంత వేగంగా నియోజకవర్గాన్ని మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. ఇతర పార్టీల నాయకులకు పెద్దపీట వేస్తూ, సొంత పార్టీ వాళ్లను అణగదొక్కి తన స్వప్రయోజనాలకు పెద్దపీట వేశారు.
అత్యంత ప్రాధాన్యం
ఒక సాధారణ వ్యక్తిని ఉద్యమ పార్టీలోకి తీసుకొని, అడుగడుగునా ప్రాధాన్యం ఇచ్చి తన సొంత తమ్ముడిలా చూసుకొని, ఉద్ధండులను సైతం పక్కనపెట్టి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, సీనియర్లను కాదని ఫ్లోర్ లీడర్ పదవులు కట్టబెట్టి, ఆపై మంచి శాఖలకు మంత్రిని చేస్తే.. ఆ హూందాతనాన్ని, హోదాను కాపాడుకోవడంలో ఈటల విఫలమయ్యారు. నిజానికి ఈటల ఎవరు? ఉద్యమపార్టీలోకి రాకముందు ఆయన జీవితం ఏమిటి? నేడు ఆయన పరిస్థితి ఏమిటి? ఈ స్థాయికి ఎలా ఎదగగలిగారు? ‘నేను కష్టపడి ప్రభుత్వ హాస్టల్లో దొడ్డు బియ్యం, పుచ్చిపోయిన కూరగాయల భోజనం తిని, చదువుకున్నానని’ అనేక సమావేశాల్లో ఈటల చెప్పారు. అక్కడివరకు ఆయన చెప్పింది నిజమే. ఆయనకు వారసత్వంగా వచ్చింది కమలాపూర్లో ఎకరం భూమి మాత్రమే.
1994 వరకు ఇదే ఆయన ఆస్తి. 1986లో హన్మకొండ సమీపంలో వెయ్యి పిల్లల కెపాసిటీ గల పౌల్ట్రీఫాం నెలకొల్పి వ్యాపారం మెదలుపెట్టారు. ఆ తర్వాత నవయుగ పాఠశాలను హన్మకొండలో స్థాపించారు. ఆ రెండు అంతగా కలిసి రాకపోవడంతో 1989లో నితిన్ గ్రాఫిక్స్ అనే జిరాక్స్ సెంటర్ను హన్మకొండలోనే పెట్టారు. ఈ వ్యాపారం కూడా పెద్దగా నడవక పోవడంతో 1994లో హైదరాబాద్కు వెళ్లి మళ్లీ పౌల్ట్రీఫాంలను లీజుకు తీసుకొని నడిపించారు. ఇది ఆయన ఉద్యమపార్టీలోకి రాకముందున్న చరిత్ర. స్వరాష్ట్ర సాధన కోసం 2001లో టీఆర్ఎస్ను నాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 2003లో ఈటల రాజేందర్ పార్టీలోకి వచ్చారు. అక్కున చేర్చుకొని సొంత తమ్ముడికంటే ఎక్కువ ప్రేమ చూపారు. నాటినుంచి నేటివరకు కేసీఆర్ ప్రతి అంశంలోనూ రాజేందర్కు పెద్దపీట వేశారు. 2004లో కమలాపూర్నుంచి టికెట్ ఇచ్చి గెలిపించారు. ఆ తర్వాత నియోజకవర్గాల డీలిమిటేషన్లో భాగంగా కమలాపూర్ పోయింది. నిజానికి నియోజకవర్గం లేదని సాకు చూపి ఈటలను కేసీఆర్ పక్కన పెట్టవచ్చు. కానీ, కేసీఆర్ అలా చేయలేదు. 2009 ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించారు. నిజానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అప్పటికే కెప్టెన్ లక్ష్మీకాంతరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ నియోజకవర్గంలో అప్పటికే మంచి పట్టుంది. అటువంటి కెప్టెన్ కుటుంబాన్ని పక్కన ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గానికి పంపించి.. హుజూరాబాద్లో ఈటలకు టికెట్ ఇచ్చి గెలిపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉండటమే కాదు, అన్ని రకాలుగా వెన్నుదన్నులా నిలిచిన కెప్టెన్ కుటుంబాన్ని కూడా ఈటలకోసం ముఖ్యమంత్రి పక్క నియోజకవర్గానికి పంపారంటే ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ఈ ఒక్క విషయాన్ని బట్టి చెప్పవచ్చు. ఈటల కోసం కెప్టెన్కు సర్దిచెప్పారు. అలాగే ప్రతి ఎన్నికల్లోనూ ఈటలకు టికెట్ ఇస్తూ, గెలిపిస్తూ వస్తున్నారు. పదవుల విషయంలోనూ ఈటలకు కేసీఆర్ పెద్దపీట వేశారు. సీనియర్ ఎమ్మెల్యేలను, అనుభవం ఉన్నవారిని సైతం కాదని టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్గా బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం రాకముందే కాదు, వచ్చిన తర్వాతకూడా ఈటలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వం వివిధ అంశాలపై వేసిన ప్రతి కమిటీలోనూ చోటు కల్పించారు. మొదటి కేబినెట్లోనే మంత్రిగా రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖల బాధ్యతలను అప్పగించారు. రెండోసారి వైద్య ఆరోగ్యశాఖ అప్పగించారు.
ఆరంభం నుంచి నేటివరకు ఎక్కడ చూసినా అవకాశాల పరంగా, హోదాలు, పదవుల పరంగా ఈటలకు పెద్దపీట వేశారే తప్ప ఏనాడూ చిన్నచూపు చూడలేదు. ఇంతటి ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ నాయకత్వంపై, ముఖ్యమంత్రిపై ఈటల వ్యవహరించిన తీరు ఎలా ఉందన్నది ఇక్కడ ప్రశ్న.
బాధ్యత తప్పి..:
టీఆర్ఎస్లో చేరేవరకు అంటే 2003 వరకు ఈటలకు ఒక రాజకీయ చరిత్ర లేదు. ఉద్యమాలు చేసిన నాయకుడు కాదు. ప్రజలకోసం కొట్లాడిన చరిత్ర లేదు. ఆర్థికంగా ఉన్న వ్యక్తి కాదు. అయినా కేసీఆర్ ఆదరించారు. ప్రతీ అవకాశాన్నీ కల్పించారు. ఈటల మాత్రం కేసీఆర్ కల్పించిన ప్రతి పదవినీ తన స్వప్రయోజనాల కోసమే వాడుకున్నారు. ఎమ్మెల్యేనుంచి నేటి మంత్రి పదవీ వరకూ అదే తోవలో వెళ్లారు.
పదవులను నియోజకవర్గ అభివృద్ధికో, లేదా ఆయన చెప్తున్నట్లు బడుగుల సంక్షేమానికో వాడలేదు. ఆ హోదాలను తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం, ఇదే సమయంలో సమాంతరంగా రియల్ ఎస్టేట్ చేసుకోవడానికే ఉపయోగించారు. నేను బలహీనవర్గాల బిడ్డను, వారి కోసం దేనికైనా పోరాటం చేస్తానని పదేపదే చెప్పే ఈటల, తన ఇంట్లో ఆ బలహీనవర్గాల సామాజికవర్గాన్ని ఎందుకు విస్తరించలేదన్నది ప్రజలకు జవాబు చెప్పాలి. బడుగులకోసం కోట్లాడే వ్యక్తి అయితే, సొంత ఇంట్లో మరో సామాజిక వర్గం విస్తరిస్తుంటే ఎందుకు కొట్లాడలేకపోయారన్నది నాతోపాటు అందరిలో తొలిచే ప్రశ్న, అంటే ఆయన ప్రజలకు చెప్పేదొకటి, ఆచరించేది మరొకటి అని చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. ఏ పార్టీకైనా ఒక నియమావళి ఉంటుం ది. దాన్ని ఎవరూ ఉల్లంఘిచరాదు. కానీ, మంత్రి ఈటల మాత్రం పదేపదే వేదికలపైనే బాధ్యత తప్పి మాట్లాడారు. గులాబీ జెండాకు తానే బాసు అన్నట్లు చెప్పడం, మరోసారి పార్టీ కాదు, వ్యక్తి ముఖ్యమని, మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను స్వయంగా తీసుకున్నట్లుగా చెప్పడం.. ఇటువంటి అసందర్భ మాటలు అనేకసార్లు మాట్లాడారు. ఒక దశలో ఆయనే మళ్లీ సర్దిచెప్పుకున్నారు. ఒక హోదాలో ఉన్నప్పుడు ప్రభుత్వ మర్యాదను కాపాడాల్సిన బాధ్యత పదవుల్లో ఉన్నవారికి ఉంటుంది. దాన్ని విస్మరించి తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరితో నెగెటివ్ మాట్లాడటం, ఎప్పుడూ అసంతృప్తిని వ్యక్తం చేయడం, ప్రభుత్వంపైనే ఇష్టానుసారంగా మాట్లాడటం, ఆదరించిన ముఖ్యమంత్రిపై, ఆయన కుటుబంపై బహిరంగ వాఖ్యలు చేయడం ఆయనకు నిత్యకృత్యమయ్యాయి.
అందరినీ తొక్కింది వాస్తవం కాదా..?
పదిహేడేండ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు కదా.. మీరు ఎదిగినంత స్పీడ్గా మీ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదే? ఒక సిద్దిపేట, ఒక సిరిసిల్ల, ఒక కరీంనగర్, ఒక మహబూబ్నగర్ లాగా హుజూరాబాద్ను ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోయారో చెబుతారా? పార్టీకోసం అహర్నిశలు కష్టపడే ఏ ఒక్క కార్యకర్తకైనా మీరు సహాయం చేశారా? కనీసం ఒక కాంట్రాక్టు ఇప్పించి వారికి ఆర్థిక రూపేణా అండగా నిలిచారా? ఎంతసేపు మీ కనుసన్నల్ల్లో మెదిలే బినామీ కాంట్రాక్టర్లకు వర్క్లు ఇచ్చి, వారినుంచి కమీషన్లు మీరు లేదా మీ కుటుంబసభ్యులు నేరుగా తీసుకుంటున్నది వాస్తవం కాదా? స్థానిక నాయకులెవరైనా సదరు కాంట్రాక్టర్ వద్దకు వెళ్తే, ‘మీకేం పనంటూ’ మీరే వారికి ఫోన్చేసి వారిని కంట్లో పెట్టుకున్నది వాస్తవం కాదా?
పార్టీ శ్రేణులను పక్కనపెట్టి ఇతర పార్టీల నాయకులకు కాంట్రాక్టులు ఇస్తున్నది మీరు కాదా? బలహీనవర్గాల నేతను అని పదేపదే చెప్పుకునే మీరు ఇతర పార్టీలకు చెందిన ఓ బలహీనవర్గాల వ్యక్తికి పదవి ఇస్తానని గులాబీ కండువా కప్పి సొంత పార్టీ వాళ్లను కాదని అతనికి పదవి కట్టబెట్టింది వాస్తవం కాదా? దీనివెనుక భూ ఒప్పందం జరిగింది నిజం కాదా? సదరు భూమిని మీ కుటుంబసభ్యులపై రిజిస్ట్రేషన్ చేయించుకొని అమ్ముకున్న తర్వాత, వచ్చిన దాంట్లో కొంత ఇమ్మని సదరు వ్యక్తి అడిగితే అతన్ని ఏకంగా పదవినుంచే తొలగించింది నియోజకవర్గ ప్రజలకు తెలియదా? ఉద్యమ నాయకులకు సరైన ప్రాధాన్యం లేదని పదేపదే చెబుతున్న మీరు మీ నియోజకవర్గంలో చేసిందేమిటి? సొంత నియోజకవర్గంలో ఎందరినో ఉద్యమ నాయకులను అణగదొక్కలేదా? 2014లో హుజూరాబాద్ నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎఎస్కు సరిపడా బలం ఉన్నా, కాంగ్రెస్నుంచి గెలిచిన వడ్లూరి విజయ్కుమార్ అనే కౌన్సిలర్కు గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకొని చైర్మన్ గిరి అప్పగించలేదా? ఆ సమయంలో ఉద్యమం కోసం అహర్నిశలూ కృషిచేసి కౌన్సిలర్గా గెలుపొందిన వారిని పక్కన పెట్టలేదా? మీ ఇద్దరిమధ్య వైరం రావడంతో అతన్ని తప్పించి మరోమారు కాంగ్రెస్నుంచి గెలిచిన వ్యక్తిని చైర్మన్ చేయలేదా? ఇదంతా మీ స్వలాభం కోసం కాదంటారా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా వలస వచ్చిన గందె రాధికకు చైర్పర్సన్ పదవిని ఇచ్చారు కదా? ఈ సమయంలో టీఆర్ఎస్ ఉద్యమ ప్రారంభం నుంచి అలుపెరుగని పోరాటం చేసిన కొలిపాక శ్రీనివాస్ భార్య నిర్మలకు పదవి వస్తుందని అందరూ ఊహించింది నిజం కాదా? అందరి అంచనాలకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నది మీరు కాదా? అలాగే, నియోజకవర్గంలో ప్రస్తుతం ఎంపీపీగా కొనసాగుతున్న ఒకరు ఎన్నికల ముందువరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు కదా!
ఉద్యమంలో పనిచేసిన ఎంతోమంది ఎంపీటీసీలు ఉండగా, కాంగ్రెస్నుంచి వచ్చినవారికి ఎందుకు కట్టబెట్టినట్లో మీరే చెప్పాలి? జడ్పీటీసీ టికెట్కూడా కాంగ్రెస్నుంచి వలస వచ్చిన వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తే సొంత పార్టీనుంచి దుమారం లేవడంతో వెనుకంజ వేసింది వాస్తవం కాదా? హుజూరాబాదే కాదు, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో పదవుల విషయంలోనూ మీరు అనుసరించింది ఇదే విధానం కదా? మీ నిర్ణయాలను విభేదిస్తూ ఒక మాజీ జడ్పీటీసీ జమ్మికుంట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేసింది మీరు మరిచిపోయారా? ఆదినుంచీ పనిచేసిన వారిని పక్కనపెట్టి మీ స్వప్రయోజనాల కోసం మీకంటూ ఒక వర్గాన్ని తయారుచేసుకున్నది తెలియంది ఎవరికో చెప్పాలి? ఇవి మచ్చుకు మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే, లెక్కకు మించిన వక్రమార్గాలను మీరు ఎన్నుకున్నారు.
తాజా పరిణామాలన్నీ నియోజకవర్గంలో అన్యాయం జరిగిన పార్టీ శ్రేణుల్లో వేడిని రగుల్చుతున్నాయి. ‘బలహీనవర్గాల బిడ్డను నేను’ అని పదేపదే చెప్పుకునే ఈటల అదే బడుగు, బలహీనవర్గాల భూములను ఎలా కబ్జా చేశారన్నది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. ‘దొరికితే దొంగ.. లేదంటే దొర’ అన్న చందంగా ఈటల వ్యవహారం ఉందని భావించాలా? లేక బడుగుల పేరు చెప్పి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న మంత్రిగా అతన్ని చూడాలా? బంగారు కడియాలు, గడియారాలు సోకులు తమకు లేవనీ చెప్తున్నారు కదా? పెద్దపెద్ద భవంతులు, హైలెవల్ విలాస జీవనం ఎందుకో? మీరే విలేకరుల సమావేశంలో అన్నీ ఒప్పుకున్నారు కదా, భూములు తీసుకున్నానంటూ, వాటిని తమ పేరు పైకి మార్చమని కోరినట్లు ? మీరు అంగీకరించికూడా మంత్రిపదవిలో ఎలా ఉంటున్నారు?
మీరు బలహీనవర్గాల బిడ్డ అని చెబుతున్నారు కదా! ఒక్కసారి హుజూరాబాద్లో జరిగిన ఒక సంఘటను మీకు గుర్తుచేస్తున్నాను. ఒక మీటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన మిమ్మల్ని కొంతమంది బీసీ విద్యార్థులు వచ్చి కలిశారు. ‘ఒక సమావేశం ఏర్పాటుచేశాం మీరు కూడా రావాల’ని ఆహ్వానించారు. ‘ఓకే’ చెప్పిన మీరు వారు వెళ్లగానే, మీ ముందు కూర్చున్నది కూడా బీసీ నాయకులే అన్న విషయం మరిచి ‘అదో బీసీల సమావేశమట! దానికి నేను వెళ్లాలట! పని లేని వెధవలంతా వచ్చి ఏదో ఒకటి చెప్తుంటారని’ బలహీనవర్గాల బిడ్డలను గురించి వ్యంగ్యాస్ర్తాలను సంధించింది నిజం కాదా ? నిజానికి అదే మీ అసలైన నిజస్వరూపం.
ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384