రూ.2 వేల సాయం ప్రకటనపై ఉపాధ్యాయుల హర్షం
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు
ఖమ్మం ఎడ్యుకేషన్/కూసుమంచి, ఏప్రిల్ 9: కరోనా ప్రభావం విద్యాసంస్థలపై పడింది. లాక్డౌన్ విధించినప్పటి నుంచి ప్రైవేటు టీచర్లకు భృతి కరువైంది. టీచర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండడాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఒక్కొక్కరికీ నెల రూ.2 వేల చొప్పున నగదు, 25 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రకటనపై ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్మార్ట్కిడ్స్ పాఠశాలలో కరస్పాండెంట్, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గత నెల వరకు యూడైస్లో నమోదైన వివరాల ఆధారంగా టీచర్లకు సాయం అందనుంది. ఖమ్మం జిల్లాలో 3,619 మంది ప్రైవేటు టీచర్లు, నాన్టీచింగ్ సిబ్బంది 127 మందికి లబ్ధి చేకూరనుంది. అర్హులైన ఉపాధ్యాయులకు ఈ నెల 25లోపు ఆన్లైన్లో నగదు బదిలీ కానుంది.
రుణపడి ఉంటాం..
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి మేలు జరుగనుంది. టీచర్లు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు. టీచర్ల జీవితాలను కరోనా అతలాకుతలం చేసింది. ఇలాంటి ఆపత్కాలంలో ప్రభుత్వం నుంచి సాయం అందిస్తానడం సంతోషాన్నిచ్చింది.
సీఎం కేసీఆర్ భరోసా
ప్రైవేటు ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను చూసి సీఎం కేసీఆర్ నెలకు రూ.2 వేలు, 25 కిలోల చొప్పున బియ్యం ఇస్తామని ప్రకటించడం హర్షణీయం. సీఎం ప్రకటనతో ప్రైవేటు టీచర్లకు భరోసా కలిగింది. నేను ఎమ్మెస్సీ బీఈడీ చేసి 12 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా.సీఎం ప్రకటన ఊరటనిచ్చింది.
సీఎంకు కృతజ్ఞతలు..
కొవిడ్ కారణంగా ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి. ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న వారు ఉపాధి లేక ఇబ్బంది పడ్డారు. మరోపని చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. వేన్నీళ్లకు చన్నీళ్లు తోడైనట్లు సీఎం ఇచ్చే సాయం మాకు ఉపయోగపడుతుంది.
టీచర్లకు ఆసరా..
ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆసరా కల్పించేందుకు నగదు, బియ్యం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తున్నాం. కరోనా మహమ్మరి కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఎంతోమంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ టీచర్స్కు అండగా నిలిచి భరోసానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
జూమ్ క్లాస్ నుంచి స్టూడెంట్ డిటెన్షన్
ఐపీఎల్.. పవర్ప్లేలో ఆర్సీబీ 46/2
ముస్లిం మహిళ మృతదేహానికి.. హిందూ ఆచారంతో అంత్యక్రియలు
అఖిల్ ప్రాణం పెట్టేస్తున్నాడు..!