డెహ్రాడూన్ : దేశాన్ని కరోనా వణికిస్తోంది. మహమ్మారి ఉధృతికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ బాట పట్టగా.. మరిన్ని పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. మరోకొన్ని రాష్ట్రాలు నైట్కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. పెరుగుతూ వస్తున్న కేసుల మధ్య ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు పేర్కొంది. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ మంత్రి సుబోధ్ యునియల్ తెలిపారు. కర్ఫ్యూ సమయంలో పాలు, కూరగాయలు, పండ్లు, మాంసం తదితర అత్యవసర దుకాణాలను ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కిరాణ దుకాణాలు ఈ నెల 13న తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్, జిమ్లు, థియేటర్లు, అసెంబ్లీ హాళ్లు, మద్యం దుకాణాలు, బార్లు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మూసే ఉంటాయని తెలిపింది. కర్ఫ్యూ సమయంలో ఐడీకార్డులు ఉన్న మీడియా వ్యక్తులకు బయట తిరిగేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతర్రాష్ట్ర ప్రయాణికులు తప్పనిసరిగా 72 గంటలకు మించకుండా ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్టును ఇవ్వాల్సి ఉంటుందని, అలాగే డెహ్రాడూన్ పరిపాలన పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉత్తరాఖండ్ ప్రజలు వారం రోజులు క్వారంటైన్లో ఉండాలని సూచించింది.
అత్యవసర సేవలు అందించే విభాగాల్లో కేవలం 50 శాతం మంది మాత్రమే హాజరవుతారని పేర్కొంది. వీలైతే వివాహాలను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కర్ఫ్యూ సమయంలో కేవలం వివాహలు, అంత్యక్రియల్లో 20 మందికి మించకుండా నిర్వహించాలని ఆదేశించింది. టీకాలు వేసుకునే వారికి సైతం ప్రభుత్వం ఆంక్షల నుంచి మినహాయింపులు, అయితే రిజిస్ట్రేషన్ను తప్పనిసరిగా చూపించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. నిన్న ఉత్తరాఖండ్లో 5,890 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 180 మంది చెందారు. 2,791 మంది కోలుకున్నారని ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ తెలిపింది.