న్యూఢిల్లీ : గంగా నదిలో కరోనా వైరస్ ఆనవాళ్లు లేవని జల్శక్తి మంత్రిత్వ శాఖ, సీఎస్ఐఆర్, ఐఐటీఆర్ లక్నో, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా చేపట్టిన అథ్యయనంలో వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ ముమ్మరంగా ఉన్న సమయంలో యూపీ, బిహార్లోని కొన్ని జిల్లాల్లో గంగా నదిలో రోగుల మృతదేహాలు తేలియాడిన క్రమంలో గంగా నదిలో కరోనా వైరస్ జాడలు ఉన్నాయనే కోణంలో అధ్యయనం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా సంస్ధలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
గంగా జలాల్లో వైరస్ ఆనవాళ్లు లభించలేదని కమిటీ నివేదిక వెల్లడించడం ఊరట కలిగించింది. ఈ కమిటీ కన్నౌజ్, ఉన్నావ్, కాన్పూర్, హమీర్పూర్, అలహాబాద్, వారణాసి, బలియా, బక్సర్, ఘజీపూర్, పట్నా, చప్రా ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించింది. ఈ నమూనాలను పరీక్షించగా కొవిడ్-19 ఆనవాళ్లు లభించలేదని నివేదిక స్పష్టం చేసింది. మే నెలలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో నదిలో మృతదేహాలు తేలియాడటం కనిపించింది. మరోవైపు నది ఒడ్డున మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించడంతో నదీ జలాల్లో వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొంది.