లక్నో: మరణించిన మహిళ మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలకు గ్రామస్తులు కరోనా భయంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వృద్ధుడైన భర్త, తన భార్య మృతదేహాన్ని సైకిల్పై మోసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లాక ఇక ముందుకు సాగలేక రోడ్డుపై సైకిల్, భార్య మృతదేహాన్ని వదిలి పక్కన కూర్చొండిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది.
జౌన్పూర్ జిల్లా మాడియాహు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్పూర్కు చెందిన తిలక్ధారీ సింగ్ భార్య 50 ఏండ్ల రాజకుమారి కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నది. ఉమనాథ్ సింగ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆమె మరణించింది. ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని అంబులెన్స్లో ఇంటికి చేర్చారు.
మరోవైపు రాజకుమారి కరోనాతో చనిపోయి ఉంటుందని గ్రామస్తులు భయాందోళన చెందారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించవద్దని భర్తకు చెప్పారు. సహాయానికి కూడా ఎవరూ ముందుకురాలేదు. దీంతో వృద్ధుడైన భర్త తిలర్ధారీ సింగ్ తన భార్య మృతదేహాన్ని సైకిల్పై మోసుకెళ్లాడు. అంత్యక్రియల కోసం చోటు వెదుకుతూ కొన్ని గంటలపాటు తిరిగాడు. ఇక ఓపిక లేక సైకిల్పై ఉన్న భార్య మృతదేహాన్నిరోడ్డుపై వదిలి పక్కన కూర్చొండిపోయాడు.
ఈ విషయం తెలుసుకున్న జౌన్పూర్ పోలీసులు ఆ వృద్ధుడి వద్దకు చేరుకున్నారు. అతడి భార్య అంత్యక్రియలను రామ్ఘాట్లో మంగళవారం జరిపించారు. కాగా, వృద్ధుడైన భర్త, అంత్యక్రియల కోసం తన భార్య మృతదేహాన్ని సైకిల్పై మోసుకెళ్లిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సహాయానికి ముందుకురాని, అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పిన గ్రామస్తులపై నెటిజన్లు మండిపడ్డారు.