జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్యచేశారు. అజ్మీర్లోని గౌలపుర ఏరియాలో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గౌలపురా ఏరియాలో మదన్ సింగ్ (85), ఆయన మైనా దేవి (81) ఓ ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. వారి ఇంటికి సమీపంలోనే కుమారుడి ఇల్లు కూడా ఉన్నది.
ఈ క్రమంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మదన్ సింగ్ ఇంట్లో చొరబడ్డారు. మదన్సింగ్ను, ఆయన భార్య మైనాదేవిని గొంతుకోసి చంపేశారు. మంగళవారం ఉదయం మృతుల కుమారుడు తల్లిదండ్రులకు టీ ఇచ్చేందుకు వెళ్లగా దారుణం వెలుగుచూసింది. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలిపై ఉన్న ఆభరణాల కోసమే దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.