లక్నో: ఇరవై ఏండ్ల పాటు సహ జీవనం చేసిన ఒక వృద్ధ జంట ఇటీవల పెండ్లి చేసుకుని ఒక్కటైంది. గ్రామస్తులే దగ్గరుండి వీరి వివాహం జరిపించడంతోపాటు పెండ్లి ఖర్చులన్నీ భరించారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నవో జిల్లాలో ఈ ఘటన జరిగింది. రసూల్పురి రూరి గ్రామానికి చెందిన 60 ఏండ్ల నరేన్ దాస్, 55 ఏండ్ల రామ్రతి 2001 నుంచి సహ జీవనం చేస్తున్నారు. వీరికి 13 ఏండ్ల కుమారుడు అజయ్ ఉన్నాడు. వారిద్దరికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో 20 ఏండ్లుగా కలిసి జీవించి వ్యవసాయం చేస్తున్నారు. ఈ జంట పెండ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే కుమారుడి భవిష్యత్తు దృష్ట్యా వివాహం చేసుకోవాలని గ్రామ సర్పంచ్, మరి కొందరు వీరికి నచ్చజెప్పారు. దీంతో ఎట్టకేలకు పెండ్లి చేసుకోవాలని ఈ వృద్ధ జంట నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో గ్రామస్తులే అన్ని ఏర్పాట్లు చేశారు. డీజే, బ్యాండ్ మేళం, విందుతో సహా పెండ్లి ఖర్చులన్నీ గ్రామ సర్పంచ్, ఇతరులు భరించారు. కుమారుడు అజయ్ దగ్గరుండి పెండ్లి పనులు చూసుకున్నాడు. గ్రామస్తులు వరుడు నరేన్ దాస్ తరుఫున ఉండి వధువు రామత్రికి స్వాగతం పలికారు. తొలుత గ్రామంలోని బ్రహ్మ దేవ్ బాబా ఆలయాన్ని సందర్శించి ఆశీసులు తీసుకున్న ఈ వృద్ధ జంట అనంతరం పెండ్లితో ఒక్కటైంది.