రాచకొండలో ఇప్పటికే 5,832 సిబ్బందికి మొదటి డోస్
రాచకొండ సీపీ మహేశ్ భగవత్
పోలీసులందరూ కరోనా నిబంధనలను పాటిస్తూ విధులు నిర్వహించాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ కోరారు. శుక్రవారం నేరేడ్మెట్లోని కమిషనరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతూ అర్హత ఉన్న వారందరూ తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. మొదటి డోసును ఇప్పటికే 5832 మంది తీసుకున్నారని తెలిపారు. ఉప ఎన్నికల సందర్భంగా సరూర్నగర్, బాలాపూర్, పహాడీషరిఫ్ తదితర సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. రంజాన్ సందర్భంగా కొవిడ్ నిబంధనల మేరకు ప్రార్థనలు జరిగేలా చూడాలని సూచించారు. పోలీసు సిబ్బందికి పోషక విలువలతో కూడిన కిట్ను అందిస్తామన్నారు. అదేవిధంగా కరోనా బారిన పడిన సిబ్బందికి తక్షణ సాయంగా లక్ష రూపాయలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. రాచకొండ పరిధిలో 113 మంది సిబ్బందికి కరోనా సోకిందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్ సుధీర్బాబు, డీసీపీలు సన్ప్రీత్ సింగ్, రక్షిత మూర్తి, నారాయణరెడ్డి, సలీమా, శ్రీనివాస్, శిల్పవల్లి తదితరులు పాల్గొన్నారు.