శరీనంలో షుగర్స్థాయి అధికంగా ఉంటే రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుందని, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మధుమేహ బాధితులు తమ వ్యాధిని నియంత్రణ చేసుకుంటూ.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పీవీరావు సూచిస్తున్నారు. అంతకు ముందు షుగర్ వ్యాధి లేకున్నా.. కరోనా చికిత్స పొందినవారిలో స్టెరాయిడ్స్, ఇతర మందుల ప్రభావం వల్ల షుగర్ లక్షణాలు బయటపడుతున్నాయని వివరించారు. కాబట్టి వైరస్ సోకినవారు డయాబెటిస్ బారిన పడకుండా ఉండేదుకు.. వైద్యుల సూచనలు తీసుకొని తగిన విధంగా జాగ్రత్తపడాలని సూచించారు. ఇటీవలి కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కరోనా తీవ్రత అధికంగా కనబడుతున్నదని.. మరణాలకు దారి తీస్తున్న పరిస్థితుల్లో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదని.. జరుగుతున్న ప్రచారాలు, వాస్తవ అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో డాక్టర్ పీవీరావు వివరణ ఇచ్చారు.
-హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ
కరోనా బారినపడి మరణించినవారిలో దాదాపు 17 శాతం మంది మధుమేహ బాధితులే ఉండటం బాధ కలిగిస్తున్నది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో స్వీయ ఆరోగ్య రక్షణ వ్యవస్థలు మందగిస్తాయి. ఈ కారణంగా శరీరంలో కరోనానే కాదు ఎటువంటి వైరస్ ప్రవేశించినా వాటిని ఎదుర్కొనే సామర్థ్యం వీరిలో తక్కువగా ఉంటుంది. గ్లూకోజ్తో కలిసిన హిమోగ్లోబిన్ ఉన్న కారణంగా.. పంపిణీ వ్యవస్థ దెబ్బతింటుంది. కరోనా ప్రభావం ఊపిరితిత్తులపై ఉన్న కారణంగా అప్పటికే మధుమేహం ఉన్నవారిలో నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో అసలేమీ తెలియకుండా కరోనాపై తీవ్రమై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. తెల్ల రక్తకణాల ద్వారా మన శరీరంలో రోగనిరోధకశక్తి బలంగా పనిచేస్తుంది. మధుమేహం కారణంగా.. ఇది బలహీన పడుతుంది. వైరస్ ప్రవేశిస్తే దాన్ని ఎదుర్కొనేందుకు తెల్ల రక్తకణాలు తొందరగా రావు.. రోగనిరోధకశక్తి పెంచే రసాయనాలు సైతం విడుదల కావు. దీంతో వైరస్ ప్రభావం తీవ్రమై మరణాలకు దారి తీస్తున్నది.
కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారికి ఉపయోగించే మందుల కారణంగా కొన్ని సందర్భాల్లో మాత్రమే షుగర్ వ్యాధికి దారితీసే అవకాశం ఉంటుంది. అంతకు ముందే షుగర్తో బాధపడుతున్నవారికి కరోనా సోకితే.. వారిలో తీవ్ర ప్రభావం కనబడుతుంది. తీవ్రమైన కరోనా లక్షణాలతో దవాఖానలో చేరినవారిలో మూడింట ఒక వంతు అంతకుముందు షుగర్ లేనప్పటికీ.. చికిత్సలో వాడే స్టెరాయిడ్లు, ఇతర మందుల కారణంగా డిశ్చార్జి అయ్యాక డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్నది.
కరోనా రోగుల్లో 60 ఏండ్లు పైబడినవారు, అనారోగ్య కారణాలున్నవారిలోనే వైరస్ ప్రభావం అధికంగా చూపిస్తున్నది. అధికంగా మధుమేహం ఉండటం లేదా రక్తపోటు, బ్రోస్కైటిస్, ఉబ్బసం, తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య.. క్యాన్సర్ చికిత్స పొందుతున్నవారు లేదా కొవిడ్ సోకి చికిత్స ప్రారంభించడంలో ఆలస్యం చేసినవారే మృతుల్లో అధికంగా ఉన్నారు. 2020లో కొవిడ్ మరణాలకు సంబంధించిన నివేదికల ప్రకారం కరోనా మరణాల్లో సగం మధుమేహం, రక్తపోటు ఉన్నట్టు తెలుస్తున్నది. వారిలో రక్తప్రసరణ సరిగా లేకపోవడం, వైరస్ ఊపిరితిత్తుల్లో వ్యాపించడం కారణంగా వైరస్ను ఎదుర్కునే సామర్థ్యం తగ్గడం, వైద్యచికిత్సలో మందులు పనిచేయని పరిస్థితి రావడం వంటి కారణాలే మణాలకు దారితీస్తున్నది.
బ్లాక్ ఫంగస్.. దీన్ని మ్యుకార్మైకోసిస్ అని అంటారు. ఇటీవల కరోనా నుంచి బయట పడినవారిలో అధికంగా కనబడుతున్నది. కొవిడ్ చికిత్స తర్వాత ఇది డయాబెటిస్ వాళ్లకే వచ్చే వరస్ట్ జబ్బు కూడా మొదలయ్యింది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కరోనా చికిత్సలో వ్యాధి తీవ్రతను బట్టి స్టెరాయిడ్స్ మరీ ఎక్కువ డోసులు తీసుకున్నవారిలో ఈ ప్రభావం ఉన్నట్టు తెలుస్తున్నది.
కరోనాలో వైరస్లు తొందరగా పెరగడానికి కావాల్సిన శక్తి.. ఏరోబిక్ ైగ్లెకాల్సిస్ ద్వారా.. ఇంకా నియోగ్లూకోజెనిసిస్, పెటీయాసిడ్ల ఆక్సిడేషన్ ద్వారా వస్తున్నదని అంచనాలున్నాయి. అందుకే టూడీ గ్లూకోజ్ ఎనలాగ్ ఇద్దామనుకుంటున్నారు. ైగ్లెకాల్సిస్ తగ్గించడానికి.. అంతేకాని ఆక్సిడేటివ్ ఫాస్పారిలేషన్ మొత్తం చెడగొట్టమనైతే కాదు. లో కార్బ్డైట్లు ఇస్తే కరోనాలో ప్రాణాలకే ముప్పు. కరోనా బాధితులకు నీళ్లు ఎక్కువ తాగించాలి. ఫ్రూట్స్ ఎక్కువగా తినిపించాలి. వైద్యచికిత్సలో స్టెరాయిడ్లు ఇస్తాం కాబట్టి కార్బోహైడ్రేట్లు తగ్గించకూడదు. కొవిడ్ వచ్చి డయాబెటిస్ ఉన్నవాళ్లకు లోకార్బోడైట్స్ ఇస్తే.. తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు కరోనాబారిన పడితే చికిత్స లో భాగంగా స్టెరాయిడ్లు ఎంతడోసుల్లో తీసుకున్నా కూడా.. షుగర్ పెరుగుతుంది. కాబట్టి 12 గంటలపాటు పనిచేసే ఇన్సులిన్ వాడుతూ.. రోజూ రెండుసార్లు రక్తంలో గ్లూకోజ్ పరీక్షలు చేయించాలి. అటువంటివారు ఉదయం 6.30కు పరగడుపున పరీక్షలో 70 మి.గ్రా కంటే తక్కువుంటే.. సాయంత్రం 7 గంటలకు ఇచ్చేఇన్సులిన్ 10యూనిట్లు తగ్గించాలి. ఉద యం 6.30కు 125 మి.గ్రా కంటే ఎక్కు వ ఉంటే.. సాయంత్రం 7గంటలకు ఇచ్చే ఇన్సులిన్ ప్లస్ 5 యూ నిట్లు పెంచాలి. రాత్రి 7గంటలకు భోజనానికి ముం దు 100 మి.గ్రా కంటే తక్కువ ఉంటే.. ఉదయం 7 గంటలకు ఇచ్చే ఇన్సులిన్లో 10 యూనిట్లు తగ్గించాలి. రాత్రి 7 గంటలకు భోజనానికి ముందు 200 మి.గ్రా కంటే ఎక్కువ ఉంటే.. ఉదయం 7 గంటలకు ఇచ్చే ఇన్సులిన్ 5 యూనిట్లు పెంచి తీసుకోవాలి.
కరోనా చికిత్స పొందుతున్నవారిలో ఇది వరకే డయాబెటిస్ ఉంటే.. ఇన్సులిన్ డోసులు ఎడ్జస్ట్ చేసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవాళ్లు స్టెరాయిడ్లు.. ఎంత డోసుల్లో తీసుకున్నా.. మొదటి రోజు నుంచే 6 గంటలపాటు పనిచేసే ఇన్సులిన్ వాడుతూ నాలుగుసార్లు రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఉదయం 6.30 గంటలకు పరగడుపున.. మధ్యాహ్నం 12.30 గంటలకు. సాయంత్రం 6.30కు భోజనానికి ముందు, అర్ధరాత్రి 12.30 గంటలకు రక్తపరీక్షలు చేయించుకోవాలి. రక్తంలో గ్లూకోజ్.. 150 మి.గ్రా కంటే తక్కువ ఉంటే ఇన్సులిన్ ఇవ్వాల్సిన పనిలేదు. 150-250 మి.గ్రా మధ్య ఉంటే ఇన్సులిన్ 15 యూనిట్లు ఇవ్వాలి. 250-350 మి.గ్రా మధ్య ఉంటే ఇన్సులిన్ 20 యూనిట్లు, 350 మి.గ్రా కంటే ఎక్కువ ఉంటే ఇన్సులిన్ 25 యూనిట్లు ఇవ్వాల్సి ఉంటుంది.