పాట్నా: హనుమంతుడిలా ప్రధాని మోదీకి ప్రతి కష్ట కాలంలో మద్దతుగా ఉన్న తనను రాజకీయంగా చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. అలాంటి పరిస్థితిలో రాముడి లాంటి మోదీ మౌనంగా చూస్తూ ఉండరని తాను నమ్ముతున్నానని ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీతో సహా బీజేపీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు అడుగడుగునా కలిసి నిలబడ్డానని చిరాగ్ తెలిపారు. అయితే బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎప్పుడూ కూడా వీటికి మద్దతు చెప్పలేదన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో బీజేపీ తనకు మద్దుతు ఇస్తుందా లేదా నితీశ్ కుమార్కు ఇస్తుందా అన్నది ఆ పార్టీనే నిర్ణయించుకోవాలన్నారు.
తన తండ్రి, లాలూ జీ ఎప్పుడూ సన్నిహితంగా ఉండేవారని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. ఆయన తన తమ్ముడని, తమ మధ్య స్నేహం మరింత దగ్గర కావాలని ఆకాంక్షించారు. బీహార్లో ఎన్నికల సమయం వచ్చినప్పుడు కూటమిపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.