న్యూఢిల్లీ, ఆగస్టు 1: కరోనా నుంచి రోగులు కోలుకోవడంలో, మహమ్మారి నుంచి రక్షణ కల్పించడంలో అశ్వగంధ ఎలా పనిచేస్తుందన్నదానిపై ఆయుష్ శాఖ ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ), యూకేకు చెందిన లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్ఎస్హెచ్టీఎం) సంయుక్తంగా అధ్యయనం చేయనున్నాయి. యూకేలోని మూడు నగరాల్లో 2వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు రెండు సంస్థలు ఒప్పందం చేసుకొన్నాయి. ఈ విషయాన్ని ఆయుష్ శాఖ ఆదివారం వెల్లడించింది. మూడు నెలల పాటు ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వెయ్యి మందికి అశ్వగంధ ఇస్తారు.
మరో వెయ్యి మందికి ఎలాంటి ఔషధం ఇవ్వకుండా పరీక్షిస్తారు. రెండు గ్రూపుల్లో రోగ నిరోధక శక్తి, వైరస్ను తట్టుకొనే శక్తిపై అధ్యయనం చేస్తారు. ఈ ట్రయల్స్ విజయవంతం అయితే కరోనా చికిత్సకు సంబంధించి అశ్వగంధకు శాస్త్రీయత లభిస్తుంది. ఆయుర్వేదంలో గొప్ప ముందడుగు అవుతుంది. అశ్వగంధ భారత సంప్రదాయ ఔషధం. ఇది శక్తినిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మిగతా ఔషధాలతో పోల్చితే సులువుగా లభిస్తుంది. భిన్న రకాల రుగ్మతలను అశ్వగంధ దూరం చేస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది కరోనాపై ఎలా పనిచేస్తుందన్న విషయంలో ఆయుష్ ఒక విదేశీ సంస్థతో కలిసి అధ్యయనం నిర్వహించడం ఇదే తొలిసారి.