న్యూఢిల్లీ: ఇజ్రాయిల్కు చెందిన పెగాసస్ స్పైవేర్తో దేశంలోని జర్నలిస్టులు, రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ఇటీవల ఓ మీడియా కథనం వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపైనే చర్చ చేపట్టాలని పార్లమెంట్లోనూ విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నాయి. అయితే పెగాసస్ వ్యవహారంపై సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపట్టాలని ఇవాళ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీని కోసం ఎడిటర్స్ గిల్డ్ రిట్ పిటిషన్ దాఖలు వేసింది. పత్రికా స్వేచ్ఛలో ప్రభుత్వ జోక్యం ఉండదని పిల్లో తెలిపారు. స్పైవేర్తో ఏయే కంపెనీలతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందో, ఎవరెవరిపైన ఆ స్పైవేర్ను వాడారో చెప్పాలని ఎడిటర్స్ గిల్డ్ తన పిల్లో కోరింది.
పిల్ దాఖలు చేసిన వారిలో అడ్వకేట్లు రూపాలి సామ్యూల్, రాఘవ తన్కా, లఫీర్ అహ్మద్లు ఉన్నారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 5వ తేదీన ఈ అంశంపై విచారణ చేపట్టనున్నది. పెగాసస్ స్నూపింగ్లో ఉన్న అయిదుగురు జర్నలిస్టులు కూడా సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు చేశారు. పెగాసస్ స్పైవేర్తో ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయినట్లు జూలై 18వ తేదీన ఓ కథనం జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే.