ఆ మార్కుల నమోదులో ఉపాధ్యాయులు బిజీ
తక్షణమే పూర్తి చేయాలని ఎస్సెస్సీ బోర్డు ఆదేశాలు
కరోనా నేపథ్యంలో రెండోసారీ పాస్
మంచిర్యాల, ఏప్రిల్ 16, నమస్తే తెలంగాణ : కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించడం అంతసులువుకాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో గతేడాది తరహాలోనే ఎస్సెస్సీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి 11,131 మంది విద్యార్థులుండగా, ఇప్పటికే పరీక్ష ఫీజు కట్టినవారందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనంద పడుతున్నారు. కరోనా నేపథ్యం లో విద్యాసంస్థలు తెరిచే అవకాశం లేకపోగా, గత సెప్టెంబర్ నుంచి ఆన్లైన్, ఈ యేడాది ఫిబ్రవరి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యక్షబోధన ప్రారంభించారు. సిలబస్ను కుదించి, ప్రశ్నపత్రాల్లో సైతం మార్పులు చేశారు. టెన్త్లో 11 పేపర్లను ఆరింటికే పరిమితం చేసి, వచ్చే నెల 17 నుంచి 26 వరకు నిర్వహించేలా షె డ్యూల్ కూడా ప్రకటించారు. పరీక్షా కేం ద్రాలను పెంచి, కొవిడ్ నిబంధనల మధ్య నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాట్లు సైతం చేసింది. కాగా, కొవిడ్ వైరస్త్ విజృంభిస్తుండడంతో గత నెల 24 నుంచి బడులను మూసేసి ఆన్లైన్ తరగతులకే పరిమితం చేసింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యక్ష బోధనకు, పరీక్షల నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది
కీలకంగా మారనున్న ఎఫ్ఏ-1 మార్కులు
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఎస్సెస్సీ విద్యార్థులందరినీ ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) మార్కుల ఆధారంగా అధికారులు గ్రేడిం గ్ ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతో గత మార్చి 15న నిర్వహించిన ఎఫ్ఏ-1 మా ర్కులు కీలకం కానున్నాయని సమాచా రం. ఇందుకోసం ఎఫ్ఏ-1 మార్కులను తక్షణమే ప్రభుత్వ పరీక్షల విభాగం (డీజీఈ) వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఎస్సెస్సీ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు చర్యలు తీసుకోవాలని డీఈవో లు, ఎంఈవోలను ఉన్నతాధికారులు కోరగా, వీరి ఆదేశాలతో ఆన్లైన్ చేసే పనిలో యంత్రాంగం బిజీ అయ్యింది. ఇప్పటికే పలు పాఠశాలలు ఎఫ్ఏ-1 మా ర్కులు ఆన్లైన్ చేయగా, మిగిలిన వారం తా శుక్రవారం అప్లోడ్ చేసే పనిలో ని మగ్నమయ్యారు. పదో తరగతి అంతర్గత మూల్యాంకన మార్కుల నమోదుకు సో మవారం వరకు గడువు పెంచినట్లు పీఆర్టీయూ నాయకులు తెలిపారు. కాగా, వి ద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొ ని సరైన నిర్ణయం తీసుకున్నట్లు ఉపాధ్యా య సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
కరోనాతో రెండోసారీ పాస్..
కరోనా సంక్షోభంతో గతేడాది కూడా ఎస్సెస్సీ పరీక్షలు రద్దయ్యాయి. పరీక్షలు కొనసాగుతుండగానే లాక్డౌన్ ప్రకటించడంతో వాయిదా వేశారు. మళ్లీ పరీక్షల ఏర్పాట్లకు సన్నాహాలు చేసినా, హైకోర్టు ఆదేశాలతో పూర్తిగా రద్దు చేశారు. ఎఫ్ఏ మార్కుల ఆధారంగా అందరినీ పాస్ చేసి, గ్రేడ్లు కేటాయించారు. ఈ యేడాది సైతం పరీక్షలు రద్దు చేయడం, పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయడంతో ఇది రెండోసారి కానుంది.