కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ (ఈసీ) బుధవారం నోటీసులు జారీ చేసింది.మతం పేరుతో ప్రచారం నిర్వహించిన వివాదంపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ముస్లిం ప్రజల ఓట్లు చీలకుండా చూడాలని ఈ నెల 3న హుగ్లీలోని తారకేశ్వర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆ వర్గానికి మమత పిలుపునిచ్చారు. బీజేపీ దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసింది. మమతా బెనర్జీ మత పరంగా ఓట్లు డిమాండ్ చేస్తున్నారని, ప్రజా ప్రతినిధుల చట్టం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించింది.
ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ బుధవారం మమతకు నోటీసులు జారీ చేసింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. లేనిపక్షంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.