వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేయాలి
కొవిడ్పై సమీక్షలో కలెక్టర్ శరత్
బిచ్కుంద, మే 19: జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి సర్వే చేపట్టాలని కలెక్టర్ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు. బిచ్కుందలో బుధవారం కొవిడ్-19పై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. త్వరలో ప్రారంభించే వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. ఇకముందు వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు తప్పకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రిజిస్ట్రేషన్పై అవగాహన కల్పించాలన్నారు. సర్వే బృందంలోని సభ్యులు కరోనా లక్షణాలు ఉన్న వారి ఇంటికి ప్రతిరోజూ వెళ్లి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కరోనా ఎలా సోకిందనే విషయాన్ని ఆరా తీయాలని తెలిపారు. ప్రతిఒక్కరూ మాస్కు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ కరోనా వ్యాధి నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, ఆర్డీవో రాజాగౌడ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
బిచ్కుందలో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుచేయాలి..
అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే మాట్లాడుతూ.. కొవిడ్ బాధితుల కోసం బిచ్కుంద ప్రభుత్వ దవాఖానలో 30ఆక్సిజన్ బెడ్లను ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ను కోరారు. బిచ్కుంద, మద్నూర్ దవాఖానలకు బాధితులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తే మరింత మెరుగైన వైద్యం అందించవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు సరిహద్దులో జుక్కల్ నియోజకవర్గం ఉండడంతో వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని, బాధితులు నిజామాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకోవడం కష్టంగా మారిందన్నారు. ఇక్కడే అన్ని వసతులను కల్పించాలని కలెక్టర్ను కోరారు.