న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు ఏమాత్రం సన్నద్ధం కాలేదని ఆమె దుయ్యబట్టారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు అస్తమానం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై నిందలు వేసే మోదీ సర్కారు ఈ విషయంలో మాత్రం తప్పించుకోలేదని ఆమె ఎద్దేవా చేశారు. బుధవారం పీటీఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రియాంక.. కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరాలో, వైద్య సదుపాయాలు కల్పించడంలో మోదీ సర్కారు ఘోరంగా ఫెయిలైందని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మంచి ఉద్దేశంతో సలహాలు ఇస్తే ఆయనను అగౌరవపర్చేలా కేంద్రమంత్రి హర్షవర్ధన్ విమర్శించారన్నారు. అందరికీ వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి రాష్ర్టాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాలపై బీజేపీ సర్కారు విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా అత్యంత దారుణంగా విజృంభిస్తోందని, ప్రస్తుతం నమోదవుతున్న ప్రతీ కేసుకు ముఖ్యకారకుడు ప్రధాని మోదీయేనని ఆమె ఆరోపించారు.ప్రస్తుతం దేశం అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నదని, దాన్నుంచి ప్రజలను కాపాడేందుకు రాజకీయాలను పక్కనబెట్టి, ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చర్యలను వేగవంతం చేయాలని, దీన్ని తాము రాజకీయం చేయాలనుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచంలోనే వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందంటే దానికి 70 ఏండ్ల ముందుచూపు పాలనే కారణమని ప్రియాంక పేర్కొన్నారు.