న్యూఢిల్లీ: కరోనా నియంత్రణలో లాక్డౌన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు లాక్డౌన్ అవసరమని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ తెలిపారు. దేశంలోని మొత్తం 718 జిల్లాల్లో మూడొంతుల జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నదని, ఇది ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు కూడా ఈ జాబితాలో ఉన్నాయన్నారు. పాజిటివిటీ రేటు 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గితే క్రమంగా ఆంక్షలను సడలించవచ్చని పేర్కొన్నారు. లాక్డౌన్ను ఎంతకాలం కొనసాగించాలన్న విషయంపై సమాచారం లేదు. ఈ క్రమంలో ఐసీఎంఆర్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
కరోనా కట్టడి చర్యలను ప్రారంభించడంలో కొంచెం ఆలస్యమైందని భార్గవ తెలిపారు. 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు నమోదైన ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాల్సిన అవసరమున్నదని ఏప్రిల్ 15న జరిగిన కొవిడ్-19 జాతీయ కార్యదళం సమావేశంలో నిపుణులు అభిప్రాయపడ్డారని భార్గవ తెలిపారు. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు వెల్లడించారు. అయితే, దాన్ని అమలు చేయడంలో కొంత ఆలస్యమైందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ వల్ల కేసులు తగ్గిన విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంక్షలకు ముందు ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతంగా ఉండేదని, అనంతరం ఇది 17 శాతానికి దిగివచ్చిందన్నారు.