భద్రాచలం : భద్రాద్రిలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్య కల్యాణ మండపం వద్ద శ్రీరాముని మహాపట్టాభిషేకం గురువారం మధ్యాహ్నం వైభవంగా జరిగింది. భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంలో క్రతువు నిర్వహించారు. కొవిడ్ దృష్ట్యా నిరాడంబరంగా రాములవారి పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. బంగారు కిరీటం, పాదుకలు, రాజదండంతో రామయ్యకు అలంకరణ చేశారు. రాత్రి 7 గంటలకు రజత రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా 27 వరకు నిత్య కల్యాణాలు నిలిపివేశారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా పూజలు, తీర్థ ప్రసాదాలు నిలిపివేశారు. నిన్న భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా కొనసాగిన విషయం తెలిసిందే.