చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇంటితో పాటు ఆయనకు సంబంధం ఉన్న 52 ప్రదేశాల్లో ఇవాళ డైరక్టరేట్ ఆఫ్ వెజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాజీ మంత్రి వేలుమణితో పాటు మరో 17 మందిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ కేసు నమోదు చేసింది. ఎస్పీ గంగాధర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ అవినీతి కేసులో విచారణ మొదలుపెట్టారు. కోయంబత్తూర్లో 35 ప్రదేశాల్లో, చెన్నైలో 15 ప్రదేశాల్లో, దిండిగల్, కాంచీపురంలోనూ డీవీఏసీ పోలీసులు సోదాలు చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అక్రమ రీతిలో తమ కుటుంబీకులు, మిత్రులకు టెండర్లు కట్టబెట్టినట్లు వేలుమణిపై ఆరోపణలు ఉన్నాయి. చెన్నై, కోయంబత్తూరు మున్సిపాల్టీల్లో సుమారు 800 కోట్ల విలువైన టెండర్లను వేలుమణి తన సన్నిహితులకు ఇప్పించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో భాగంగా సోదాలు నిర్వహిస్తున్నారు.