కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దసరా సందర్భంగా వివిధ ఆకృతుల్లో దుర్గా పూజ మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇందులో భాగంగా కోల్కతాలోని లేక్ టౌన్లో దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా టవర్ని ప్రతిబింబించేలా దుర్గా పూజ పండల్ను నిర్మించారు. ప్రతి ఏటా ఐకానిక్ భవనాల ప్రతిరూపంలో దుర్గా మాతా మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. గతంలో పారిస్లోని ఒపెరా, కేదార్నాథ్, పూరీ జగన్నాథ ఆలయం థీమ్ ఆధారంగా పండల్స్ను నిర్మించినట్లు ఆయన చెప్పారు.
ఈ ఏడాది ఏర్పాటు చేసిన 145 అడుగుల పొడవైన బుర్జ్ ఖలీఫా టవర్ని పోలిన మండపం రాత్రిపూట ప్రత్యేకంగా వెలుగులు విరజిమ్ముతుందని మంత్రితోపాటు శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ చీఫ్ అయిన సుజిత్ బోస్ తెలిపారు. దీని కోసం ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈ మండపం నిర్మాణం కోసం 250 మంది కార్మికులు రెండు నెలలపాటు శ్రమించారని ఆయన వెల్లడించారు.