కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దసరా నేపథ్యంలో ఏర్పాటు చేసే దుర్గా దేవి మండపంలో ఈసారి యూపీలోని లఖింపూర్ ఖేరీ ఘటనతోపాటు రైతుల నిరసనలపై పలు కళారూపాలను ఏర్పాటు చేశారు. డమ్ డమ్ పార్క్ భారత్ చక్ర పండల్లో చప్పులతో కూడిన ఆకృతి ఎంతో ఆకట్టుకుంటున్నది.
తెగిన చెప్పులతోపాటు, రెండు పెద్ద పాదాలపై రైతుల బొమ్మలతో గోడపై ఏర్పాటు చేసిన త్రీడీ, 4డీ ఆర్టులు రైతుల నిరసనల అణచివేతకు అద్దం పడుతున్నాయి. అలాగే లఖింపూర్ ఖేరీలో రైతులపై వాహనం దూసుకెళ్లిన ఘటనను ప్రతిబింబిస్తూ ఒక కారు చిత్రానికి రెండు టైర్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయం గొప్పదాన్ని చాటేలా పచ్చని పంట పొలం బ్యాక్గ్రౌండ్లో దుర్గా దేవి విగ్రహాన్ని ఉంచారు.
ఈ మండపం ప్రవేశం వద్ద ఒక ట్రాక్టర్కు రెండు పెద్ద రెక్కలు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో సుమారు ఏడాదిగా నిరసనలు చేస్తున్న రైతుల పేర్లతో కూడిన చిన్న పేపర్లను ఈ రెక్కలపై అంటించారు. తమ లక్ష్యాన్ని చేరుకోవాలన్న రైతుల ఆకాంక్షకు ఇది అద్దం పడుతున్నదని దుర్గా దేవి మండపం నిర్వాహకులు తెలిపారు.