శ్రీనగర్ : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా.. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు.. 4 వేల కిలోమీటర్ల దూరాన్ని 50 రోజుల్లో పూర్తిచేసే పరుగు కార్యక్రమాన్ని ఇండియన్ ఆర్మీ మ్యాన్ పి. వేలు గురువారం ప్రారంభించాడు. ఇండియన్ ఆర్మీ అథ్లెట్ అయిన వేలు పరుగు శ్రీనగర్లో ప్రారంభమైంది. గ్రీన్ ఇండియా, ఒక దేశం ఒకే ఆత్మ అనే రెండు నినాదాలను ప్రేరణగా పరుగును ప్రారంభించాడు. ఢిల్లీ, ఇండోర్, ముంబై, బెంగళూరు మీదుగా కన్యాకుమారికి చేరుకోనుంది. ఫ్లాగ్ ఆఫ్ వేడుకలో సీనియర్ ఆర్మీ అధికారులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
వేలు తన పాఠశాల రోజుల్లోనే దూరాలు పరుగెత్తడం అలవాటుగా చేసుకున్నాడు. సైన్యంలో చేరేముందు కూడా అనేక మారథాన్లలో పాల్గొన్నాడు. తన తాజా ప్రయత్నంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సుదూర పరుగులో తనకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన ఆర్మీకి అతడు కృతజ్ఞతలు తెలిపాడు. ఐదేళ్లుగా తాను అల్ట్రామారథాన్లో ఇండియా జట్టు కోసం పాల్గొంటున్నట్లు తెలిపాడు.
గతేడాది 1600 కిలోమీటర్ల పరుగులో లిమ్కా రికార్డును సాధించినట్లు చెప్పాడు. ఈ సంవత్సరం 50 రోజుల్లో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4 వేల కిలోమీటర్ల దూరం పరుగుతీసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించాడు. 50 రోజులను లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ వాస్తవానికి దాన్ని 47 నుండి 48 రోజులలో పూర్తి చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.