సర్వసభ్య సమావేశంలో ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ
ధర్మారం,జూన్4: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ సూచించారు. ఆమె అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించగా, ఎంపీడీవో జయశీల, తహసీల్దార్ సంపత్, మండల వైద్యాధికారి సంపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎం పీపీ మాట్లాడుతూ, ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారులు పరిష్కరించాలని సూచించారు. మండలస్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే మంత్రి ద్వారా ఉన్నతాధికారులతో మాట్లాడి తీర్చే ప్రయత్నం చేస్తామని ఆమె పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు సోకకుండా పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వెటర్నరీ శాఖ వారికి ఆమె సూచించారు. ధర్మారంలో కరోనా అదుపులోకి రావడంతో అభినందనీయమని, ధాన్యం కొనుగోళ్లలో మండలం జిల్లాలో టాప్గా నిలువడంపై ప్యాక్స్ చైర్మన్లను, ఏఎంసీ చైర్మన్ను ఎంపీపీ అభినందించారు. ఇంకా సభలో పలు అంశాలపై సభ్యులు ప్రస్తావించారు. గ్రామాల్లో ఇంకా మిగిలిన మిషన్ భగీరథ పనులను పూర్తి చేయించాలని సభ్యులు ఆ శాఖ ఏఈ విలాసరావును సభ్యులు కోరారు. సరఫరాలో ఇబ్బందులు తొలగించాలని ఆయనకు సర్పంచులు, ఎంపీటీసీలు సూచించారు. సెల్ఫ్ లాక్డౌన్తోనే ధర్మారంలో కరోనా అదుపులోకి వచ్చిందని వైద్యుడు వివరించారు. నంది మేడా రం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి మాట్లాడు తూ, ధర్మారం, ఖిలావనపర్తి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఏఏఈ రాజేందర్, ఏఈ సురేశ్ దృష్టికి తీసుకెళ్లారు. వదులు తీగెలు, మిడిల్ పోల్స్, విస్తరణ స్తంభాలు వెంటనే వేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ధోరణి వద్దని మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫి వివరించారు. ఇటీవల నర్సింగాపూర్లో విద్యుదాఘాతంతో మరణించిన గొర్రెల కాపరికి పరిహారం ఇప్పించాలని పత్తిపాక ఎంపీటీసీ సభ్యుడు బద్దం అజయ్పాల్ రెడ్డి కోరారు.
సమావేశం వాయిదా
ముత్తారం, జూన్4: అధికారులు హాజరు కాకపోవడంతో మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం వాయిదా పడిందని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 11 గంటల వరకు అధికారులు హాజరు కాలేదు. 12 గంటల వరకు వేచి చూసినా రాలేదు. దీంతో అధికారులు హాజరు కా కపోతే ఈ సమావేశం వద్దని ఎంపీటీసీలు, సర్పంచులు ఎంపీపీ జక్కుల ముత్తయ్యకు తెలుపడంతో సర్వసభ్య సమావేశాన్న వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సర్వసభ్య సమావేశానికి హాజరు అధికారులను గుర్తించి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు.