న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్కు డ్రగ్ నియంత్రణ సంస్థ డీసీజీఐ షాకిచ్చింది. స్పుత్నిక్ లైట్ టీకా మూడవ దశ ట్రయల్స్ను నిర్వహించ వద్దు అంటూ డీసీజీఐ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్స్ చేపట్టేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చేసిన అభ్యర్థనను డీసీజీఐ తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నిపుణుల కమిటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. మూడవ దశ ట్రయల్స్ నిర్వహించేందుకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు కనిపించడం లేదని నిపుణుల కమిటీ చెప్పింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ టీకాను సింగిల్ డోసు రూపంలో తేనున్నారు. కానీ ఇండియాలో ఈ టీకాకు ఇంకా అనుమతి దక్కలేదు.
ఇండియాలోకి సింగిల్ డోసు స్పుత్నిక్ లైట్ టీకాలను తీసుకురావాలనుకుంటున్నట్లు ఇటీవల రెడ్డిస్ ల్యాబ్ సీఈవో దీపక్ సప్రా తెలిపారు. ఈ టీకా ఇండియా మార్కెట్లోకి వస్తే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం అవుతుందన్నారు. స్పుత్నిక్ లైట్ టీకా సామర్థ్యం 80 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ ఈ టీకాకు అనుమతి దక్కితే, అప్పుడు దాన్ని రూ.700కు అమ్మనున్నట్లు తెలిపారు.