న్యూఢిల్లీ, జూలై 15: దేశంలో డ్రోన్ల వాడకాన్ని సులభతరం చేసేలా కేంద్రప్రభుత్వం డ్రోన్ రూల్స్ పేరిట కొత్త నిబంధనలను రూపొందించింది. డ్రోన్లను వినియోగించేందుకు ఇప్పటి వరకు 25 దరఖాస్తులు నింపాల్సి ఉండగా తాజా నిబంధనల్లో వాటిని ఆరుకు తగ్గించింది. అంతే కాకుండా డ్రోన్ల పరిమాణంతో సంబంధం లేకుండా దరఖాస్తు ఫీజులను కూడా నామమాత్రంగా వసూలు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు పౌరవిమానయానశాఖ గురువారం నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. కేంద్రం నిర్ణయాన్ని డ్రోన్ ఫెడరేషన్ ఇండియా(డీఎఫ్ఐ) స్వాగతించింది.
ముసాయిదాలో మరికొన్ని ముఖ్యాంశాలు
గ్రీన్ జోన్లలో 400 అడుగులు, ఎయిర్పోర్టులకు 8-12 కిలోమీటర్ల పరిధిలో 200 అడుగుల ఎత్తు వరకు డ్రోన్ల సంచారం కోసం ఎలాంటి ఎయిర్ లైన్ అనుమతులు అవసరం లేదు.
వాణిజ్యేతర మైక్రోడ్రోన్లు, పరిశోధనల్లో ఉపయోగించే నానో డ్రోన్లకు పైలట్ లైసెన్స్ అక్కర్లేదు.
దేశంలో రిజిస్టర్ అయిన విదేశీ సంస్థల డ్రోన్లపై ఎలాంటి ఆంక్షలు లేవు.
కార్గో డెలివరీల కోసం డ్రోన్ కారిడార్ల ఏర్పాటు.
కశ్మీర్లో మళ్లీ డ్రోన్ల కలకలం
జమ్ముకశ్మీర్లో మళ్లీ డ్రోన్లు కలకలం రేపాయి. గురువారం రాత్రి సాంబా, కథువా జిల్లాల్లో సైనిక శిబిరాల వద్ద రెండు డ్రోన్లను గుర్తించినట్టు సైనికవర్గాలు తెలిపాయి. పలు రౌండ్లు కాల్పులు జరుపడంతో అవి వెనుదిరిగినట్టు పేర్కొన్నాయి.