జమ్ము: భారతీయ సైనిక స్థావరంపై తొలిసారి డ్రోన్ దాడి జరిగింది. ఆదివారం నడి రేయి దాటిన తర్వాత ఉదయం 1.37, 1.43 గంటలకు జమ్ము ఎయిర్ బేస్లో డ్రోన్ ద్వారా రెండు ఐఈడీలను జారవిడిచారు. దీంతో స్వల్ప తీవ్రతతో రెండు పేలుళ్లు జరిగాయి. ఒక బాంబు దాడిలో టెక్నికల్ సెక్షన్ బిల్డింగ్ రూఫ్ స్వల్పంగా ధ్వంసం కాగా మరో బాంబు బేస్ ప్రాంగణంలో పేలింది. ఈ ఘటనలో ఇద్దరు ఐఏఎఫ్ సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. డ్రోన్ల దాడికి సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ బేస్లోని హెలీకాప్టర్ల పార్కింగ్ ఏరియా లక్ష్యంగా ఈ బాంబు దాడులు జరిగినట్లు తెలుస్తున్నది. అయితే ఈ పేలుళ్లతో ఎలాంటి నష్టం జరుగలేదని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా అక్కడి నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
జమ్ము ఎయిర్బేస్పై జరిగిన డ్రోన్ దాడి ఉగ్రవాద దాడేనని జమ్ముకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ అన్నారు. ఎయిర్ బేస్ ప్రాంతానికి సమీపం నుంచి డ్రోన్ను తక్కువ ఎత్తులో ఆపరేట్ చేసి రెండు ఐఈడీలను ప్రయోగించారని తెలిపారు. ఉగ్రవాద నిరోధక చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఐఏఎఫ్, నేషనల్ బాంబ్ డేటా సెంటర్, ఫోరెన్సిక్ నిపుణులు, జమ్ముకశ్మీర్ పోలీసులు కూడా ఈ దాడిపై దర్యాప్తు చేస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణే లడఖ్ సరిహద్దులో మూడు రోజుల పర్యటన నేపథ్యంలో జమ్ము ఎయిర్ బేస్పై డ్రోన్ల దాడి జరుగడం విశేషం. ఈ ఘటన నేపథ్యంలో శ్రీనగర్తోపాటు సమీపంలోని ఎయిర్ బేస్లు, అంబాలా, పఠాన్కోట్ ఎయిర్ బేస్లను అలెర్ట్ చేశారు.