హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా వైరస్ రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో మాజీ అథ్లెట్లు, కోచ్లను ఆదుకునేందుకు కేంద్ర క్రీడాశాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్), భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య(హెచ్ఎఫ్ఐ)అధ్యక్షుడు జగన్మోహన్రావు, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్..ఐవోఏ ప్రతినిధులుగా ఎంపికయ్యారు. కొవిడ్-19 అంతకంతకూ విస్తరిస్తున్న క్రమంలో ఆర్థికంగా, వైద్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ ప్లేయర్లు, కోచ్లు ఆన్లైన్లో ఈ లింక్(www.research.net/r/sai-ioa-covid-19) ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని జగన్మోహన్రావు సూచించారు. వెబ్సైట్లో ఒకసారి వివరాలు పొందుపరుచగానే తమకు సమాచారం అందుతుందని దానిని పరిశీలనలోకి తీసుకుని తక్షణ సహాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడాశాఖతో ఐవోఏ సమన్వయం చేసుకుంటూ కరోనాతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలిచేందుకు కృషి చేస్తామని జగన్మోహన్రావు తెలిపారు.