హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం
పటాకులు కాల్చి.. సంబురాలు చేసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు
దుండిగల్, మార్చి 20 : హైదరాబాద్, రంగారెడ్డి, మ హబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఘన విజయం సాధించడంపై శనివారం టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి పార్టీ నాయకుడు కొలన్ గోపాల్రెడ్డి పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అభివృద్ధికే పట్టభద్రులు మరొక్క సారి పట్టం కట్టారన్నారు. ప్రజల మద్దతు, ముఖ్యంగా విద్యావంతుల మద్దతు టీఆర్ఎస్కే ఉన్నదని ఈ ఎన్నికలతో మరోసారి రుజువైందన్నారు.
దుండిగల్ మున్సిపల్లో..
దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంభీపూర్కృష్ణ ఆధ్వర్యంలో పలువురు నిజాంపేట కార్పొరేటర్లు, దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు తెలంగాణ భవన్కు తరలివెళ్లి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.