రెండు శాసనాల గుర్తింపు
జైన మతం ఆనవాళ్లు ప్రత్యక్షం
కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెల్లడి
మద్దూరు, మార్చి 29: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లిలో పురాతన జైన దేవాలయం ఉంది. జైనబసదిగా పిలిచే ఈ ఆలయం రాష్ట్రకూటుల కాలంలో నిర్మించినట్టుగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఈ బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, మహ్మద్ నసీరుద్దీన్, శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, మల్లావఝల నారాయణశర్మ రెండు, మూడు రోజులుగా ఇక్కడ పర్యటించి పరిశోధించి అనేక విషయాలు వెలుగులోకి తెచ్చారు. ఈ జైనబసది ఏకకూట దేవాలయంగా వీరు గుర్తించారు.
దేవాలయ పాదవర్గం(గోడలు)పైన రాష్ట్ర కూటుల కాలం నాటి స్తంభాలు, గూటి బొమ్మలు ఉన్నాయని, గుడి ప్రవేశద్వారం ఉత్తరాశిమీద గజలక్ష్మి, కింద జైనమహావీరుడి శిల్పం ఉండి కనిపించే ఏకైక జైనబసదిగా గుర్తించారు. ఇక్కడి శాసనం మీద కూడా జైన తీర్థంకరుని శిల్పం ఉన్నదని, లోపలి భాగంలో ధ్వంసమైన శిల్పాలు ఉన్నట్టు కనుగొన్నారు. ప్రస్తుతం ఆనవాళ్లుగా జైనతీర్థంకరుడు మహావీరుడి మూడు సింహాలతో అధిష్ఠానపీఠం, తలపై కనిపించే మూడు పొరల గొడుగు ఉన్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు తెలిపారు.
ఆలయం లోపల ఒక మూలన లాంఛనంతో, అరుదైన జైనతీర్థంకరుడు అరనాథుని అధిష్ఠానపీఠం ఉన్నదని, ఈ దేవాలయం కాకతీయుల కాలంలో శైవాలయంగా మార్చినట్టుగా ఆనవాళ్లను గుర్తించామన్నారు. కాకతీయశైలి స్తంభాల మంటపం, గుడిలోపలి విగ్రహాలు, శిల్పాలు ప్రస్తుతం కనిపించడం లేదని, బైరాన్పల్లిలో చాళుక్యుల కాలంనాటి రెండు శాసనాలు దొరికినట్టు వారు వెల్లడించారు. శైవాలయంగా మారిన జైనబసది ఉన్నదని, అక్కడే పురాతనమైన శిథిల శివాలయం ఉన్నదని, దానిలో ఇప్పుడు కాకతీయుల కాలంనాటి త్రిభంగిమలో నిలబడి ఉన్న చతుర్భుజ భైరవుని విగ్రహం ఉన్నట్టు వారు తెలిపారు.
ఢమరుకం, త్రిశూలం, ఖడ్గం, రక్తపాత్రలు, శునకం, ఇద్దరు పరిచాలకులు ఉన్నట్టు వారు తమ పరిశోధనలో గుర్తించినట్టు చెప్పారు. ఈ గుడిముందర కనిపించే నాగశిల్పాలు రాష్ట్రకూటశైలి విగ్రహాలని, మరో నాలుగు నాగశిల్పాలు కూడా చాళుక్యుల శైలిలో చెక్కినవిగా గుర్తించినట్టు వెల్లడించారు. మరికొన్ని విరిగిన నాగశిల్పాలు ఆ ఆవరణలో ఉన్నాయన్నారు. దీర్ఘచతురస్రాకారపు రాతిపలక మీద చెక్కిన చిన్న హనుమంతుని శిల్పం, విరిగిన నల్లరాతి నంది విగ్రహం ఇక్కడ శివాలయం ఉన్నదని తెలిపారు. అలాగే రెండు బైరాన్పల్లి శాసనాలను కూడా గుర్తించినట్టు వారు వెల్లడించారు.