న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: వైద్య కళాశాలల్లో యూజీ ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష -నీట్ (యూజీ) ఆదివారం జరుగనున్నది. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 200 పట్టణాల్లోని 3,842 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో సహా 13 భారతీయ భాషల్లో పరీక్షా పత్రం ఉంటుంది. భౌతిక, రసాయన, జంతు, వృక్ష శాస్ర్తాలకు సంబంధించి మొత్తం 180 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. పెన్నూ పేపరు విధానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్లోకి అనుమతించబోరు. కాగా పరీక్ష రాసే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
హాల్లోకి తీసుకురాకూడని వస్తువులు
ప్రింట్ చేసిన కాగితాలు, చీటీలు, పెన్సిల్బాక్సు, ప్లాస్టిక్ పౌచ్, క్యాలిక్యులేటర్, పెన్ను, స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్, రబ్బర్, ఎలక్ట్రానిక్ పెన్ను, స్కానర్, మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ఫోన్స్, హెల్త్ బ్యాండ్, వాచ్, పేజర్, మైక్రోఫోన్, వ్యాలెట్, పౌచ్, గాగుల్స్, టోపీ, హ్యాండ్ బ్యాగు, బెల్ట్, కెమెరా, ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు.
డ్రెస్ కోడ్
లేత రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. పొడుగు చేతులుండే డ్రెస్లు వేసుకోవద్దు. ఒకవేళ మతపరమైన సంప్రదాయం ప్రకారం అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తే.. అలాంటి వారు మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్ష కేంద్రానికి రావాలి.
అభ్యర్థులు బూట్లు వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. స్లిప్పర్లు, తక్కువ హీల్ ఉండే సాండిల్స్ మాత్రమే వేసుకుని రావాలి.
అమ్మాయిలు చెవిపోగులు, చైన్లు, ముక్కు పుడక, నెక్లెస్, బ్రాస్లెట్ వంటి ఆభరణాలు, అబ్బాయిలు చైన్లు, బ్రాస్లెట్లు వేసుకోవద్దు.
నీట్-పీజీకి 1.6 లక్షల మంది హాజరు
వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన నీట్-పీజీ పరీక్షకు 1.6 లక్షల మంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 679 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
అడ్మిట్ కార్డు డౌన్లోడ్ ఇలా..
https://neet.nta.nic.in/ వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి.