న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సమసిపోయేందుకు వ్యాక్సినేషనే కీలక ఆయుధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. జులై చివరి నాటికి ప్రభుత్వం రోజుకు 90 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేపడితే దేశంలో కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేయవచ్చని ప్రముఖ కార్డియాలజిస్ట్, మెదాంత ఆస్పత్రి సీఎండీ డాక్టర్ నరేష్ త్రెహన్ పేర్కొన్నారు. మనం చేతులారా కరోనా సెకండ్ వేవ్ ను కొనితెచ్చుకున్నామని, మరోసారి ఇలాగే వ్యవహరిస్తే దేవుడే మనల్ని కాపాడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తొలి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో మరణాలు రెట్టింపైన సంగతిని గుర్తుచేశారు. మనం రోజుకు 50 లక్షల వ్యాక్సిన్ డోసులు వేయగలిగితే వైరస్ ప్రభావం 25 శాతం తగ్గుతుందని, జులై మధ్య నాటికి మనం రోజుకు 70 లక్షల వ్యాక్సిన్ డోసులు వేస్తే మహమ్మారి ముప్పు 50 శాతానికి తగ్గించవచ్చని అన్నారు. జులై మాసాంతానికి రోజుకు 90 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేపట్టగలిగితే కరోనా మహమ్మారిని దాదాపు రూపుమాపవచ్చని డాక్టర్ త్రెహన్ వివరించారు.