హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం రోజుకో మలుపు తిరుగుతున్నది. అధ్యక్షుడు అజారుద్దీన్ నియామకం చెల్లదని అపెక్స్ కౌన్సిల్ చెబుతుంటే.. అజార్ నియమించిన అంబుడ్స్మన్ జస్టిస్ దీపక్ వర్మ ఆదివారం అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కౌన్సిల్లోని ఐదుగురు సభ్యులు జాన్ మనోజ్, విజయానంద్, నరేశ్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనూరాధలపై నిబంధన 41 (1) (బి) ప్రకారం విచారణకు ఆదేశించారు. మరోవైపు అంబుడ్స్మన్ నిర్ణయాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పుపడుతున్నది. విశ్రాంత న్యాయమూర్తి దీపక్వర్మను హెచ్సీఏ అంబుడ్స్మన్గా అంగీకరించడం లేదని కార్యదర్శి విజయానంద్ అన్నారు.