హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ‘మాకు తెలిసినవారిలో ఏ ఒక్కరికీ ఇప్పటివరకు వ్యాక్సిన్ ఇవ్వలేదు. మా వాళ్లంతా వ్యాక్సిన్ కోసం వెళ్లి డోసులు అందుబాటులో లేక తిరిగి వచ్చారు’ వ్యాక్సినేషన్పై లోకల్ సర్కిల్స్ సర్వేలో 76 శాతం మంది మాట ఇదే. ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 255 జిల్లాలకు చెందిన 24 వేల మందిని ఈ సంస్థ సర్వే చేసింది. వీరిలో 67 శాతం మంది పురుషులు, 33 శాతం మంది మహిళలు ఉన్నారు. 46 శాతం మంది టైర్-1 పట్టణాలు, 27 శాతం టైర్-2 పట్టణాలు, 27 శాతం టైర్ 3, 4 పట్టణాలకు చెందినవారు ఈ సర్వేలో పాల్గొన్నారు.
వ్యాక్సిన్ వేసుకునేందుకు భారతీయుల్లో ఆసక్తి పెరిగింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెట్టినప్పుడు 38 శాతం మంది ఆసక్తి కనబరిచారు. ఇప్పుడది 77 శాతానికి పెరిగిందని లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. మార్చిలో మొదటి డోస్ వేసుకున్న చాలామంది సీనియర్ సిటిజన్లకు ఏప్రిల్లో రెండోడోస్ దొరకలేదు. దేశంలో వ్యాక్సిన్ల కొరతను దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఆప్షన్లు (వ్యాక్సిన్ల)ను అందుబాటులోకి తీసుకురావాలని 56 శాతం మంది కోరారు. అమెరికాకు చెందిన వ్యాక్సిన్లను జూన్ నాటికైనా అందుబాటులోకి తేవాలని ఆకాంక్షించారు. మరో 33 శాతం మంది విదేశాల నుంచి వ్యాక్సిన్లు వద్దని తేల్చి చెప్పారు.