న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వేవ్ చిన్నారులే లక్ష్యంగా విరుచుకుపడవచ్చని అప్పటికి తల్లితండ్రులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడం మేలని ప్రముఖ కార్డియాక్ సర్జన్, నారాయణ హెల్త్ వ్యవస్ధాపక చైర్మన్ డాక్టర్ దేవి షెట్టి సూచించారు. థర్డ్ వేవ్ లో వ్యాధి బారినపడే చిన్నారులకు చికిత్స అందించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం సరైన చర్యని ఆయన వ్యాఖ్యానించారు.
కొవిడ్-19 ఫస్ట్ వేవ్ వయసు మళ్లిన వారిపై అధికంగా దాడి చేయగా, సెకండ్ వేవ్ యువ, మధ్యవయస్కులపై ప్రభావం చూపిందని, యువత, మధ్యవయస్కులు ఇప్పటికే కొవిడ్ బారినపడటం లేదా యాంటీ బాడీలు పెరగడంతో థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని డాక్టర్ దేవి షెట్టి ఓ వాణిజ్య పత్రికకు రాసిన వ్యాసంలో స్పష్టం చేశారు. థర్డ్ వేవ్ చిన్నారులపై పంజా విసురుతుందనే అంచనాతో అప్పటికి చిన్నారుల తల్లితండ్రులకు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే వారు తమ పిల్లలు ఆస్పత్రుల పాలైతే వారిని జాగ్రత్తగా చూసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు. మరోవైపు 16 ఏండ్లలోపు చిన్నారులకు టీకాలు రూపొందించడంపై ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ వేగవంతమయ్యాయి.