న్యూఢిల్లీ, మే 1: భారత్లో రెండో దశ కరోనా ఉద్ధృతి కట్టడికి దేశవ్యాప్తంగా కొన్ని వారాల పాటు లాక్డౌన్ విధించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారుడు డాక్టర్ ఆంథోనీ ఎస్ ఫౌచీ సూచించారు. భారత్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపిస్తున్నదన్న ఆయన… మరో రెండు సూచనలు కూడా చేశారు. చైనా తరహాలో తాత్కాలిక దవాఖానలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కరోనా పరిస్థితుల పర్యవేక్షణకు కేంద్రీకృత వ్యవస్థ ఉండాలని సూచించారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆక్సిజన్, ఔషధాలు, పీపీఈ కిట్లను ఎలా సమకూర్చుకోవాలో ప్రణాళికను రూపొందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. అమెరికాలో తాము నేషనల్ గార్డ్ సహాయం తీసుకున్నట్టు భారత్ కూడా తన సైన్యం తోడ్పాటును పొందాలని సూచించారు. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలన్నారు. 1.4 బిలియన్ జనాభా కలిగిన భారత్… వ్యాక్సిన్ డోసుల కోసం తయారీదారులతో వీలైనంత త్వరగా ఒప్పందాలు చేసుకోవాలని చెప్పారు. కరోనాపై విజయం సాధించేసినట్టు భారత ప్రభుత్వం చాలా ముందే ప్రకటించిందని గుర్తుచేశారు.