న్యూఢిల్లీ : సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, పడకకే పరిమితమైన వారికి ప్రస్తుతం ఇంటింటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం బొంబాయి హైకోర్టుకు నివేదించింది. ఇండ్లకు సమీపంలో వ్యాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటు సాధ్యమేనని ఇది ఇంటింటికి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మెరుగైన ప్రత్యామ్నాయమని పేర్కొంది. వ్యాక్సిన్ నిర్వహణపై జాతీయ నిపుణుల గ్రూప్ (నెగ్ వాక్) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిందని కేంద్రం తెలిపింది.
విదేశాల్లో వ్యాక్సినేషన్ విధానాన్ని పరిశీలించి కేంద్రం తనదైన రీతిలో ఇంటింటికీ వ్యాక్సినేషన్ చేపట్టడాన్ని పరిశీలించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా కేంద్రానికి సూచించారు. సీనియర్ సిటిజన్లు సహా నిర్ధిష్ట గ్రూపులకు ఇంటింటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని గత నెల బొంబాయి హైకోర్టు నెగ్ వాక్ ను కోరింది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు వంటి వారు వ్యాక్సినేషన్ కేంద్రాలకు రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా బొంబాయి హైకోర్టు ఈ మేరకు కేంద్రాన్ని కోరింది.