సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ, జూలై 13: క్రిమినల్, ఉగ్రవాద నిరోధక చట్టాలను అసమ్మతివాదులపై ప్రయోగించవద్దని, అసమ్మతిని అణచివేయడానికి ఉపయోగించవద్దని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. చట్టాలు దుర్వినియోగం అవుతున్న పక్షంలో, పౌరుల స్వేచ్ఛను హరిస్తున్న వేళ కోర్టులు రక్షణగా ముందు వరుసలో నిలవాలని అభిప్రాయపడ్డారు. ఇండియా-అమెరికా చట్టపరమైన సంబంధాలపై ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ చట్టం కూడా పౌరులను ఇబ్బందులకు గురిచేయడానికి, వారి స్వేచ్ఛను హరించడానికి రూపొందించింది కాదని నొక్కి చెప్పారు. ‘వ్యక్తి స్వేచ్ఛను ఒక్కరోజు హరించినా స్వేచ్ఛను హరించినట్టే’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఊపా) కింద భారీగా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో చంద్రచూడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.