ఠాణె: ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు, ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాపారుల డిమాండ్లు నెరవేరే వరకు జీఎస్టీ చెల్లించొద్దని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని ఠాణెలో జరిగిన ట్రేడర్ల సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి తమ సందేశాన్ని పంపేందుకు ఆందోళన చేపట్టాలని వ్యాపారులను కోరారు. ఉద్ధవ్ (మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే) మరియు ప్రధాని నరేంద్ర (మోదీ) మీ ముంగిట్లోకి వస్తారు అనే పేరుతో ఆందోళన చేపట్టాలని సూచించారు.
దేశంలోని 6.50 లక్షల ఫెయిర్ ప్రైస్ షాప్ ఓనర్లకు ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్స్ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. దాని ఉపాధ్యక్షుడిగా ప్రహ్లాద్ మోదీ పని చేస్తున్నారు. డిమాండ్లు నెరవేరే వరకు జీఎస్టీ చెల్లించొద్దని వ్యాపారులను కోరారు.
నరేంద్రమోదీ కావచ్చు.. మరొకరు కావచ్చు.. వారు మీ సమస్యలు వినాలి.. ఈ రోజు మీకు చెబుతున్నా. మేం జీఎస్టీ చెల్లించబోమంటూ తొలుత మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. మనమంతా లోక్సాహి (ప్రజాస్వామ్యం)లో ఉన్నాం.. మనం బానిసలం కాం అని పేర్కొన్నారు.