హైదరాబాద్ : ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఈటల రాజేందర్ విమర్శల్లో వాస్తవం లేదు. టీఆర్ఎస్లో తనకు గౌరవం లేదని ఈటల రాజేందర్ చెప్పడం సత్యదూరం. ఈటల గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం జరగలేదు. టీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేసే విధంగా పలుసార్లు ఈటల మాట్లాడారు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2003లో ఈటల రాజేందర్ పార్టీలో చేరారు. పార్టీలో ఈటల చేరకముందే ఉద్యమం ఉధృతంగా ఉందన్నారు. ఉద్యమ కాలంలోనూ ఈటలను కేసీఆర్ అన్ని విధాలా గౌరవించి ప్రాధాన్యత ఇచ్చారు అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి మంత్రివర్గంలోనే ఈటలకు చోటు దక్కిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ఈటల రాజేందర్కు ఏం తక్కువైందో తమకు అర్థం కావడం లేదన్నారు. ఈటల రాజేందర్కు సీఎం కేసీఆర్ అన్ని రకాల పదవులు, అవకాశాలు ఇచ్చారు. టీఆర్ఎస్ఎల్పీ నేతగా, ఆర్థిక, పౌరసరఫరాలు, వైద్య శాఖ మంత్రిగా ఈటలకు అవకాశం ఇచ్చారు. పథకాలపైన కూడా మాట్లాడి విమర్శించడం చాలా బాధాకరం. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించడం సరికాదు.
పేదలకు, దళితులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని కొనకూడదని ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు. 66 ఎకరాల అసైన్డ్ భూమిని కొన్నానని ఈటలనే స్వయంగా చెప్పారు. అసైన్డ్ భూములను వ్యాపార విస్తరణ కోసం కొనుగోలు చేసినట్లు ఈటలే చెప్పారు అని గుర్తు చేశారు. ఈటలకు వ్యాపారమే ముఖ్యం.. బీసీలు, ఎస్సీల స్థితిగతులు పట్టవు అని చెప్పారు. ఎకరం కోటిన్నర పలికే భూమిని రూ. 6 లక్షలకే కొనుగోలు చేశారు. విలువైన భూములను తక్కువ ధరకు ఎందుకు కొనుగోలు చేశారు. దేవరయాంజల్లో దేవాలయ భూములను కూడా కొనుగోలు చేశారు. దేవాలయ భూములని తెలిసి కూడా ఎందుకు కొనుగోలు చేశారు? అని ప్రశ్నించారు. పార్టీ ద్వారా అనేక రకాలుగా ఈటల లబ్ధి పొందారు. మీకు ఏదో అన్యాయం జరిగిందని సీఎంపై దాడి చేయడం తగదు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.