న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలను పెంచేశారు. పౌరవిమానయాన శాఖ శుక్రవారం కొత్త ఆదేశాలు జారీ చేసింది. విమానాల్లో దిగువ ఛార్జీల పరిమితిని 13 శాతం నుంచి 16 శాతానికి పెంచారు. దీంతో 40 నిమిషాల ప్రయాణం కలిగిన విమానంలో ఇప్పుడు కనీస ఛార్జీ రూ.2600గా ఉంటుంది. గతంలో ఈ చార్జీ రూ.2300గా ఉంది. 40-60 నిమిషాల ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ ప్రస్తుతం రూ. 2,900 ఉండగా అది రూ. 3,300కి పెరుగుతుంది. 60-90 నిమిషాల ప్రయాణానికి రూ.4000, 90-120 ని.కు రూ.4700, 120-150 ని.కు రూ.6100, 180-210 ని.కు 8700 దిగువ పరిమితిగా ఉండనుంది.
జూన్ ఒకటో తేదీ నుంచి పెంచిన ఛార్జీలు అమలులోకి వస్తాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ తన ఆదేశాల్లో పేర్కొన్నది. విమానయాన సంస్థలు జూన్ ఒకటో తేదీ నుంచి కేవలం 50 శాతం మాత్రమే తమ సర్వీసులను నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం కోవిడ్ వల్ల 80 శాతం సర్వీసులకు మాత్రమే అనుమతి ఉన్నది. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల గత కొన్ని వారాల నుంచి విమాన ప్రయాణికులు చాలా వరకు తగ్గిపోయారు. మే నెలలో ఇప్పటి వరకు సుమారు 40 వేల మంది ప్రయాణికులు దేశీయ విమానాల్లో తిరిగినట్లు తెలుస్తోంది.