ముంబై : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో లాక్డౌన్ అమలుకు సన్నాహాలు చేపట్టాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారులను కోరిన క్రమంలో బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఈ వ్యవహారంపై స్పందించారు. కరోనా వైరస్ కేసుల పెరుగుదలకు లాక్డౌన్ పరిష్కారం కాదని పేర్కొన్నారు. పుణే పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తాను కలిసిన అనంతరం పాటిల్ విలేకరులతో మాట్లాడారు. లాక్డౌన్ ప్రతిపాదనను బీజేపీయే కాకుండా వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
లాక్డౌన్ ప్రకటిస్తే మీరు ప్రజలకు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించరు..ఇక ప్రజలు ఎలా బతకాలని ఆయన ఠాక్రే సర్కార్ను ప్రశ్నించారు. నైట్ కర్ఫ్యూ విధించడం పట్ల ఎలాంటి అభ్యంతరం లేదని, రోజువారీ కార్యకలాపాలు మాత్రం యథాతథంగా సాగాలని సూచించారు. నైట్ కర్ఫ్యూతో ఇబ్బందులు లేవని, మీ ప్రభుత్వంలో మాత్రం కొందరు నైట్లైఫ్కు అలవాటు పడ్డవారికి మాత్రం ఇబ్బందికరమని ఎద్దేవా చేశారు, లాక్డౌన్ అనివార్యమని మీరు భావిస్తే అసంఘటిత కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు రూ 5000 అందించాలని కోరారు. కొవిడ్ పరీక్షలను ముమ్మరంగా చేపట్టడం, పాజిటివ్ రోగులను గుర్తించి చికిత్స అందించడం కీలకమని, లాక్డౌన్తో ఎలాంటి ప్రయోజనం ఉండదని పాటిల్ స్పష్టం చేశారు.