హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): అడవుల పునరుజ్జీవనం ద్వారా రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యత మెరుగుపడి, జీవ వైవిధ్యం పెం పొందిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తెలంగాణ అడవుల్లో కనిపించే విభిన్న జంతుజాతులపై జూలాజికల్ సర్వే ఆఫ్ ఇం డియా రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని అరణ్య భవన్లో మంత్రి గురువారం ఆవిష్కరించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ జంతుజాలంపై ఇది ప్రత్యేకంగా రూపొందించిన మొదటి పుస్తకమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రెండు పు లుల సంరక్షణ కేంద్రాలు (అమ్రాబాద్, కవ్వాల్), ఏడు అభయారణ్యాలు(ప్రాణహిత, శివారం, ఏటూరునాగారం, పాఖాల, కిన్నెరసాని, మంజీరా, పోచారం), మూడు జాతీయ పార్కుల్లో (కేబీఆర్, మృగవని, హరిణ వనస్థలి) అధ్యయనం జరిగినట్లు వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 2,450 రకాల జంతువులు, పక్షులు, పాములు, కీటకాల జాతులను గుర్తించినట్లు కార్యక్రమంలో పాల్గొన్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ కైలాశ్చం ద్ర తెలిపారు. 1,744 వెన్నెముక లేని, 706 రకాల వెన్నెముకతో కూడిన జంతువులు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మాత్రమే కనిపించే 82 రకాల జంతువులను ఇక్కడి అడవుల్లో గుర్తించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన భోజ్ చిత్తడి నేలలు- వన్యప్రాణులపై రూపొందించిన పుస్తకాన్ని కూడా మంత్రి విడుదల చేశారు. కార్యక్రమంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్లు సిద్దానంద్ కుక్రేటీ, ఎం.సీ. పర్గెయిన్, ఏ.కే. సిన్హా, హైదరాబాద్ సీసీఎఫ్ ఎం.జే.అక్బర్, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ ఇన్చార్జి డాక్టర్ దీపా జైస్వాల్, ఓఎస్డీ శంకరన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.