పాట్నా: బీహార్లో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్, ఎంపీ అయిన సంజయ్ జైస్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో బీహార్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరింది. గత నెల ఆరంభంలో ఉన్న యాక్టివ్ కేసులకు ఇది 50 రెట్లు. దీంతో ఆసుపత్రులలోని బెడ్లు నిండిపోగా ఆక్సిజన్ నిల్వలు తరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలిసిన వారికి సహాయం కోసం మిత్రుడైన పాట్నాకు చెందిన డాక్టర్కు ఫోన్ చేసినా ఎత్తని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. దీంతో తనకు తెలిసిన చాలా మంది కరోనాతో మరణించారని వాపోయారు. తన నియోజకవర్గమైన చంపారన్లో ఏర్పాటు చేసిన కరోనా కేంద్రాలు కూడా రోగులతో నిండిపోయాయని తెలిపారు. పడకల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ చాలడం లేదన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడమే కరోనా వైరస్కు మంచి చికిత్స అని సంజయ్ జైస్వాల్ తెలిపారు. దురదృష్టవశాత్తు ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి గురించి చాలా మంది ప్రజలు సరిగా అర్థం చేసుకోవడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలంతా తగిన జాగ్రత్తలు పాటించాలని, కరోనా నుంచి కాపాడుకోవాలని సూచించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.